వారిద్దరూ కలిశారు, రాజీ ఫార్మూలా ఏమిటీ? ఎన్నికల గుర్తు కోసమేనా !
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇవాళ ములాయం సింగ్ యాదవ్ తో సమావేశమయ్యారు.ఇద్దరి మద్య రాజీ ఫార్మూలా కుదిరిందని సమాచారం . అయితే ఈ ఫార్మూలా ఏమిటనేది ఇంకా బయటకు రాలేదు.
లక్నో :సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరపడింది.అయితే ఈ సంక్షోభ నివారణలో భాగంగా మంగళవారం ఉదయం తండ్రీ తనయులు మరోసారి సమావేశమయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. తండ్రి కొడుకుల మద్య రాజీ కుదరడం పట్ల పార్టీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
నెలరోజులకు పైగా పార్లీలో నెలకొన్న సంక్షోభం సమసిపోయినట్టే కన్పిస్తోంది. ఈ సంక్షోభ నివారణకు గాను ములాయం సింగ్ యాదవ్ చొరవచూపారు. పార్టీ ఎన్నికల గుర్తు అఖిలేష్ యాదవ్ కే దక్కే పరిస్థితులు కన్పించాయి.
పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులంతా అఖిలేష్ వైపే మెగ్గుచూపారు. ములాయం వైపు మాత్రం నామమాత్రంగా పార్టీ నాయకులు నిలిచారు. అయినా ములాయం మొండిగా వ్యవహరించారు.చివరకు ఇరువర్గాలు రాజీ మంత్రాన్ని పాటించాయి.
ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి అభ్యర్థి గా అఖిలేష్ పేరును ప్రకటించి ములాయం సింగ్ యాదవ్ ఆశ్చర్యపర్చాడు.అయితే పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించుకొంటామని ఆయన ప్రకటించాడు.
ములాయంతో అఖిలేష్ భేటీ
దాదాపుగా నెల రోజులకు పైగా సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు తెరపడింది. అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంతవరకు పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు తెరపడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.మంగళవారం ఉదయం పూట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరు కూడ పార్టీలో నెలకొన్న సమస్యలపై చర్చించారు.
కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు
తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని సమాజ్ వాదీపార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం నాడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ములాయంతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ పార్టీ బాద్యతల నుండి బాబాయ్ శివపాల్ యాదవ్ ను తప్పించాలని అఖిలేష్ డిమాండ్ చేశారు.దీనికి తోడుగా అమర్ సింగ్ ను కూడ పార్టీ నుండి బయటకు పంపాలని డిమాండ్ చేశాడు అఖిలేష్. అయితే ఈ రెండు డిమాండ్లను ఇప్పటికిప్పుడే పరిష్కరించే పరిస్థితులో లేమని ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ కు చెప్పారని పార్టీలో ప్రచారం సాగుతోంది.
గుర్తు కోసం రాజీ పడ్డారా
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమీషన్ ప్రకటించింది. అయితే ఎన్నికల గుర్తు కోసం ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లు పోటాపోటీగా అఫిడవిట్లు దాఖలు చేశారు. ములాయం సింగ్ యాదవ్ కు మద్దతిచ్చేవారు తక్కువ మంది ఉన్నారు. అయితే ఈ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు గ్రూపులు కూడ ఎన్నికల గుర్తు కోసం పోటాపోటీగా అఫిడవిట్లు దాఖలు చేశాయి. అయితే ఈ రెండు గ్రూపులకు కాకుండా ఇద్దరికి వేర్వేరు గుర్తులను కేటాయించేందుకు ఎన్నికల కమీషన్ ఆసక్తిగా ఉందనే వార్తలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇరు వర్గాలు రాజీకి వచ్చాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇరువర్గాలు రాజీకి వచ్చాయని సమాచారం.
రాజీ ఫార్మూలా ఏమిటి ?
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి తనయులు ఇద్దరూ గొడవకు దిగడం సరికాదని భావించారు. వీరిద్దరి మద్య రాజీ కుదిరింది. అయితే ఆ రాజీ ఫార్మూలా ఏమిటనేది ఇంకా బయటకు రాలేదు. తండ్రికొడుకులిద్దరూ కూడ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇద్దరూ నాయకులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు.