వారణాసి: ప్రధాన పార్టీలకు రణక్షేత్రంగా మారింది
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదశ పోలింగ్ జరిగే వారణాసి ప్రధాన పార్టీలకు రణక్షేత్రంగా మారింది.
వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదశ పోలింగ్ జరిగే వారణాసి ప్రధాన పార్టీలకు రణక్షేత్రంగా మారింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై బీజేపీతోపాటు ఎస్పీ - కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాయి.
మోదీ, అఖిలేశ్ - రాహుల్ నిర్వహించిన రోడ్షోలలో ఇరుపక్షాల కార్యకర్తల నినాదాలతో వారణాసి వీధులు హోరెత్తాయి. నగర శివారుల్లో బీఎస్పీ అధినేత మాయావతి బహిరంగ సభ నిర్వహించారు. ఒకవైపు వారణాసిలోని టౌన్హాల్లో ప్రధాని సభ జరుగుతుండగానే ఎస్పీ-కాంగ్రెస్ కూటమి రథయాత్ర సాగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రధాని మోదీ, ఎస్పీ - కాంగ్రెస్ కూటమి నేతలు అఖిలేశ్, రాహుల్ వారణాసిలో రోడ్ షో సందర్భంగా బీజేపీ, ఎస్పీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జిచేసి వారిని చెదురగొట్టారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ ఎటువంటి అనుమతి లేకుండానే వారణాసిలో రోడ్షో నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఏఐసీసీ కార్యదర్శి కేసీ మిట్టల్ తెలిపారు.
నేతలు భారీగా తరలి రాగా..
యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంయుక్తంగా శనివారం నిర్వహించిన రోడ్ షో జయప్రదమైంది. ఇరు పార్టీల సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, రాజ్ బబ్బర్, దీపేంద్ర హుడా, జితిన్ ప్రసాద, ధర్మేంద్ర యాదవ్, మిత్రపక్షాల కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ తొలిసారి రెండు పార్టీల ఉమ్మడి రోడ్షోలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటకు ప్రారంభమైన రోడ్ షో 10 కిలోమీటర్ల పొడవునా సాగింది.
కాశీనాథుడి ఆలయంలో అఖిలేశ్ దంపతుల ప్రత్యేక పూజలు
యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మీరు చేసిన పనులు చెప్పండి: అఖిలేశ్
యూపీ అభివృద్ధికి మీరుచేసిన పనులేమిటో చెప్పాలని ప్రధాని మోదీని సీఎం అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. బదోహిలో జరిగిన ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలో చేసిన పది అభివృద్ధి పనులు మేం ప్రజలకు చెప్పాం. మీరు చేసిన పది పనుల గురించి చెప్పగలరా? ఐదేండ్లలో మా ప్రగతిపై నివేదిక వెల్లడించేందుకు సిద్ధం. మూడేండ్లలో మీరు చేసిందేమిటో చెప్పండి అని మోదీని సవాల్ చేశారు.
మాయా.. బీజేపీతో జత కడతారేమో జాగ్రత్త
బతికుండగానే తన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న బీఎస్పీ అధినేత మాయావతి తన భాష మార్చుకుంటున్నారని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. తనకు పెద్దమ్మ వంటిదైన మాయావతి ఎన్నికల తర్వాత బీజేపీతో జత కడ్తారేమో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సభ వద్ద ఎక్కువ మంది నిలబడిన గోడ కూలడంతో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.
5000 మందికి పైగా విద్యార్థుల జోడు
వారణాసిలో ఎస్పీ - కాంగ్రెస్ కూటమి నేతలు అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ నిర్వహించిన రోడ్ షోలో 5000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కూటమికి మద్దతుగా రెండు పార్టీలు ప్రకటించిన హామీలతో కూడిన లేఖను అందజేశారు.
వైద్యులు, మెడికోల మద్దతు
కాంగ్రెస్ యువనేత రాహుల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రోడ్ షోలో వైద్యులు, వైద్య విద్యార్థులు కూడా బాగస్వాములయ్యారు.
వారణాసి టౌన్ హాల్ వద్ద ఉద్రిక్తత
వారణాసిలో టౌన్ హాల్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ సభ జరుగుతుండగానే కాంగ్రెస్ - ఎస్పీ రోడ్ షో ఆ రోడ్డు మీదుగా ముందుకు వచ్చింది. దీంతో ఎప్పుడేమి జరుగుతుందోనని పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. రోడ్ షో వేగిరంగా ముందుకు సాగాలని సీఎం అఖిలేశ్ను పోలీసు ఉన్నతాధికారులు కోరడం కనిపించింది.
కేజ్రీవాల్.. పారికర్.. అఖిలేశ్
ఇతర పార్టీలు ఇచ్చే డబ్బు తీసుకుని తమ పార్టీకి ఓటేయమని కోరిన నేతల జాబితాలో అఖిలేశ్ యాదవ్ చేరిపోయారు. బదోహి ప్రచారసభలో మాట్లాడుతూ ఇతర పార్టీల వారు ఓటర్లకు డబ్బు పంపిణీచేస్తున్నట్లు విన్నాను. మీకు సలహా ఇస్తున్నా. మీరు డబ్బు తీసుకోండి. ఓటుమాత్రం సైకిల్ పై వేయండి అని కోరారు. ఇంతకుముందు ఢిల్లీ, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ నేత - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఇదే విధంగా ఇతరులు ఇచ్చే డబ్బు తీసుకుని తమ పార్టీకి ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
బహుత్ ఝూట్ పాఠశాలకు ప్రిన్సిపాల్ మోదీ
బీజేపీ అంటే బహుత్ ఝూట్ పాఠశాల (పలు అసత్యాల పాఠశాల) అని, దానికి ప్రధాని మోదీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
హామీల అమలులో ప్రధాని మోదీ విఫలం
ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా మీడియాతో అన్నారు.
మోదీ హయాంలో దిగజారిన ప్రధాని ప్రతిష్ట
ప్రధాని మోదీ హయాంలో ప్రధాని కార్యాలయం గౌరవం దిగజారిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జెవాలా అన్నారు.
ప్రధాని హోదాలో చౌకబారు వ్యాఖ్యలా?
సమాధులు, శ్మాశాన వాటికల గురించి ప్రధాని మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ భావించలేదన్నారు.
ప్రధాని మోదీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
అనుమతి లేకుండా వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై వాస్తవ నివేదిక పంపాలని యూపీ అధికారులను ఈసీ ఆదేశించింది.