దేశరాజకీయాలను శాసిస్తారా: ఎస్పీ బీఎస్పీల మధ్య అధికారికంగా కుదిరిన పొత్తు..పోటీ చేసే స్థానాలు ఇవే..!
దేశ రాజకీయాల్లో అధికారికంగా కొత్త పొత్తు ఉదయించింది. దేశంలో రాజకీయంగా కీలకంగా ఉండే ఉత్తర్ప్రదేశ్లో ఈ పొత్త జరిగింది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేది. ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఇద్దరూ దోస్త్ మేరీ దోస్త్... తూహే మేరీ జాన్ అంటూ సాంగ్ వేసుకుంటున్నారు. ఇప్పటికే అర్థమైపోయింటుంది ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారన్న సంగతి. అవును మీరు ఊహించింది నిజమే... ఉత్తర్ ప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సంయుక్త మీడియా సమావేశంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్... బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతిలు ఒక్కటయ్యారు. 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
మారనున్న పొలిటికల్ ఈక్వేషన్స్
ఉత్తర్ ప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ పార్టీలు ఒక్కటవడంతో దేశ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. తాము పొత్తు పెట్టుకుని 2019లో బీజేపీని ఎదుర్కొంటామని అఖిలేష్ మాయావతిలు ప్రకటించారు. ఇద్దరూ చెరో 38 స్థానాల్లో పోటీచేసేందుకు అంగీకరించారు. అదే సమయంలో రెండు స్థానాలు అంటే యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి తాము అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం లేదని స్పష్టం చేశారు.
అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, ఈరోజు మీవల్లే దుబాయ్ ఇలా ఉంది: రాహుల్ గాంధీ
బీజేపీకి ఇక నిద్రలేని రాత్రులు: మాయావతి
ఎస్పీ బీఎస్పీల పొత్తుతో ప్రధాని నరేంద్ర మోడీకి నిద్రపట్టదని ఇకనుంచి ప్రతిరోజు నిద్రలేని రాత్రులే ఆయనకు ఉంటాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అంతేకాదు తమ పొత్తుల్లో కాంగ్రెస్ పార్టీని కలుపుకోవడం లేదని మాయావతి స్పష్టం చేశారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇటు ఎస్పీకి కానీ, అటు బీఎస్పీకి కానీ ఎలాంటి లాభం చేకూరదని ఆమె అన్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు అవినీతిలో పోటీపడుతున్నాయని మాయావతి ధ్వజమెత్తారు. ఒకరు బోఫోర్సులో ఆరోపణలు ఎదుర్కొంటుంటే మరొకరు రాఫెల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ ఎమర్జెన్సీని ప్రకటిస్తే నేడు అప్రకటిత ఎమర్జెన్సీని బీజేపీ తలపిస్తోందని ఫైర్ అయ్యారు. రైతులు, దళితులు ఇతర వర్గాల వారు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేరన్న మాయావతి ఇటు బీజేపీ పాలనలో కూడా అదే జరుగుతోందని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే నిజాయితీగల పార్టీలుగా గుర్తింపు పొందిన సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలకు నష్టం చేకూరుతుందని మాయావతి అన్నారు.
ప్రధానిగా యూపీ వ్యక్తే దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారు: అఖిలేష్
ఇదిలా ఉంటే దేశంలో రాష్ట్రంలో బీజేపీ మతరాజకీయాలు చేస్తోందని అది దేశానికే ప్రమాదమని అఖిలేష్ అన్నారు. పేద ప్రజలు, రైతులు, దళితులు, మహిళలపై గత ఐదేళ్లలో దాడులు ఎక్కవయ్యాయని చెప్పిన అఖిలేష్ పొత్తుకోసం ముందుకొచ్చిన మాయావతికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగిన బుద్ధి చెప్పేందుకు ఎస్పీ బీఎస్పీలు ఒకటి కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గతంలో యూపీ రాష్ట్రం దేశానికి ఎంతో మంది ప్రధానులను అందించిందని ఈ సారి కూడా ఆ ట్రెండ్ ఫాలో అవుతుందని అఖిలేష్ అన్నారు. మాయావతిని ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెపై విమర్శలు చేసిన వ్యక్తులకు మంత్రి పదవులను బీజేపీ కట్టబెట్టిందని చెప్పిన అఖిలేష్ ఇక ఆనాడే మాయావతితో కలవాలని తాను భావించినట్లు వెల్లడించారు. ఇకపై కార్యకర్తలు మాయావతిని ఏమైనా అంటే అది తనను అన్నట్లుగానే భావిస్తానని అఖిలేష్ చెప్పారు. ఎస్పీ బీఎస్పీ కార్యకర్తలు కలిసి పనిచేయాల్సిందిగా పిలుపునిచ్చారు.