అది బీజేపీ వ్యాక్సిన్- నేను వేయించుకోను- అఖిలేష్ యాదవ్ సంచలనం
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురావాలని భారత్లో తయారీ సంస్ధలు, కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా వ్యాక్సిన్ను బీజేపీకి ఆపాదిస్తూ యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
భారత్లో కరోనాపై పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న వ్యాక్సిన్ను తాను నమ్మబోనని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ఈ వ్యాక్సిన్ నమ్మదగిందిగా లేదన్నారు. తాను వ్యాక్సిన్ వేయించుకోబోనంటూ అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాను బీజేపీ నేతలను నమ్మబోనని, తాము అధికారంలోకి వస్తే ఉచిత వ్యాక్సిన్ను అందుబాటులోకి తెస్తామని అఖిలేష్ తెలిపారు.
ఆక్స్ఫర్డ్ టీకాను భారత్లో సరఫరా చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆమోదం తెలిపిన కొద్ది గంటల్లోనే అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన వివాదం రేపుతోంది. అదీ ఇవాళ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రకటనతో రాజకీయ వివాదం రేపారు. కేంద్రంలో బీజేపీ సర్కారు కరోనా వైరస్ గురించి మాత్రమే ఆలోచిస్తుందని, కానీ విపక్ష పార్టీలు వ్యాక్సిన్పై చేతల్లో చూపిస్తాయని అఖిలేష్ వ్యాఖ్యానించారు. కరోనా నుంచి బయటపడేందుకు చప్పట్లు కొట్టాలని, ప్లేట్లు మోగించాలని ఇప్పటికే పలుమార్లు బీజేపీ సర్కారు మోసం చేసిందన్నారు.
అఖిలేష్ వ్యాఖ్యలపై యూపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న శాస్త్రవ్తేతలను అఖిలేష్ వ్యాఖ్యలు నిరుత్సాహ పరిచేలా ఉన్నాయని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విమర్శించారు. శాస్త్రవేత్తలకు అఖిలేష్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. అఖిలేష్ వ్యాక్సిన్ను నమ్మకపోతే ఆయన్ను యూపీ ప్రజలు నమ్మబోరన్ మౌర్య కౌంటర్ ఇచ్చారు.