జేఎన్యూ ఘటనపై ఐషే ఘోష్ సహా ముగ్గురి విచారణ, రెండోరోజు విచారణకు అక్షత్, రోహిత్ గైర్హాజరు
జేఎన్యూలో ఆడియో టేపుల వ్యవహారంపై విచారణకు హాజరుకావాలని అక్షత్ అవస్తీ, రోహిత్ షాను ఢిల్లీ పోలీసులు ఆదేశించిగా.. సోమవారం కూడా వారు గైర్హాజరయ్యారు. వరసగా రెండోరోజు కేసు విచారణకు హాజరుకాకపోవడంతో నోటీసులు అందజేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు ఆదివారం నుంచి వారిద్దరీ ఆచూకీ తెలియడం లేదని, మొబైల్స్ కూడా స్విచాఫ్ చేశారని పోలీసులు తెలిపారు. ఆడియో టేపుల పార్ట్-2లో వెలుగులోకి వచ్చిన కోమల్ శర్మకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆమె కూడా విచారణకు హాజరుకాలేదు. ఫోన్ స్విచాప్ చేసుకున్నారని పోలీసులు చెప్పారు.
ప్రశ్నల వర్షం
సోమవారం ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్, జేఎన్యూ ముగ్గురు విద్యార్థులను మాత్రం ప్రశ్నించారు. జేఎన్యూ ఎస్యూ నేత ఐషే ఘోష్కు క్యాంపస్లో జరిగిన ఘటనతో సంబంధం ఉందా అని ఆరాతీశారు. ఆమెతోపాటు పంకజ్ మిశ్రా, విజయ్ మెక్ను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ ముగ్గురితోపాటు 9 మందికి ఘటనతో సంబంధం ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు.
హై టెన్షన్
గత వారం క్యాంపస్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియతో ఉద్రిక్తతకు దారితీసింది. హింసకు కారణం తొమ్మిది మంది అని, అందులో 8 మంది వామపక్షాలకు చెందిన జేఎన్యూ ఎస్యూ కాగా ఇద్దరు ఏబీవీపీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఐషే ఘోష్, మిశ్రా, మెక్, డోలాన్ సమంతా, ప్రియా రంజన్, సుజేతా, చుంచున్ కుమార్ వామపక్షాలకు చెందినవారు కాగా.. వికాస్ పటేల్, యోగేంద్ర భరద్వాజ్ ఏబీవీపికి చెందినవారు అని పోలీసులు తెలిపారు.
ఫుటేజీ
జేఎన్యూలో చెలరేగిన హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ భద్రపరిచి, అప్పగించాలని వర్సిటీని కోరినా.. పాలకవర్గం స్పందించలేదని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలియజేశారు.
స్టింగ్ ఆపరేషన్
ఇండియాటుడే చేసిన స్టింగ్ ఆపరేషన్లో వర్సిటీలోని సబర్మతి హాస్టల్ వద్ద గల వామపక్ష విద్యార్థులపై దాడి చేసే ప్రయత్నం చేసినట్టు అక్షత్ అవస్తీ అంగీకరించారు. అక్షత్కు హెల్మెట్ అందజేసినట్టు రోహిత్ షా కూడా తెలిపారు. గీత కుమారి, కోమల్ శర్మ వీడియోలు వైరలైన సంగతి తెలిసిందే.