అల్ ఖైదా చేతివాటం: భారత్ రైల్వే వెబ్ సైట్ హ్యాక్
ముంబై: భారత రైల్వేకి చెందిన ఓ వెబ్ సైట్ ను అల్ ఖైదా ఉగ్రవాదులు హ్యాక్ చేశారు. భారత రైల్వే శాఖ మీద ఉగ్రవాదుల కన్ను పడటంతో అధికారులు హడలి పోయారు. సెంట్రల్ జోన్ పరిధిలోని మహారాష్ర్టలోని భుసావల్ డివిజన్ కు చెందిన వెబ్ సైట్ ను అల్ ఖైదా ఉగ్రవాదులు హ్యాక్ చేశారని అధికారులు చెప్పారు.
విషయం తెలుసుకున్న భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల నుంచి భారత రైల్వేకి తొలిసారి ఇలాంటి పరిణామం ఎదురుకావడంతో ఆ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే శాఖ వెబ్ సైట్ హ్యాకింగ్ ద్వారా దేశ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారా అని అధికారులు ఆరా తీస్తున్నారు.
వెబ్ సైట్ హ్యాక్ చేసిన అల్ ఖైదా ఉగ్రవాదులు 11 పేజీల సందేశాన్ని అదే వెబ్ సైట్ లో పెట్టారు. ఉగ్రవాద నేత ఆసీమ్ ఉమర్ పేరుతో ఆ సందేశం ఉంది. అందులో భారత్ ముస్లీంలు జిహాద్ పాఠాలు మరిచిపోతున్నారని, వారికి మళ్లీ ఆ పాఠాలు నేర్పించి యుద్దరంగానికి కదిలేలా చేస్తామని హెచ్చరించారు.
ప్రజలు జిహాద్ లో పాల్గోనేందుకు అమెరికా, దాని మిత్రపక్షాలను ఓడించడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ రైల్వేలో 115 రైల్వే స్టేషన్లు ఉన్న భూసావల్ డివిజన్ వెబ్ సైట్ కు ట్రాఫిక్ ఎక్కువే అని అధికారులు అంటున్నారు. ఈ డివిజన్ పరిధిలో ముస్లీం జనాభా ఎక్కువగానే ఉందని అధికారులు అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే తమ భావజాల విస్తరణకు అల్ ఖైదా ఈ చర్యకు పూనుకుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆసీమ్ ఉమర్(సనౌల్ హక్) దక్షిణాసియా విభాగానికి చీఫ్ గా పని చేసేవాడు. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత అతను అల్ ఖైదాలో చేరాడు. 1995 నుంచి అతను మాయం అయ్యాడని అధికారులు అంటున్నారు.