భారత ఆర్థిక వ్యవస్థే టార్గెట్.. కాశ్మీర్లో సైన్యంపై దాడులకు పిలుపునిచ్చిన అల్ ఖైదా చీఫ్..
కాశ్మీర్ : ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా భారత్లో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్లో భారత ఆర్మీపై జిహాదీ దాడులు చేయాలంటూ అల్ ఖైదా చీఫ్ అయిమన్ అల్ జవహరి తాజాగా ఓ వీడియోలో పిలుపునిచ్చాడు. కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను ఉద్దేశించి దాదాపు 14 నిమిషాల పాటు ప్రసంగించిన వీడియోను అల్ ఖైదా మీడియావింగ్ రిలీజ్ చేసింది.
డోన్ట్ ఫర్ గెట్ కాశ్మీర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో అల్ జవహరి భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వం, అక్కడ విధులు నిర్వహిస్తున్న సైన్యంపై దాడులు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని జవహరి ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు. ఆర్మీపై దాడులతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని, మానవ, సాంకేతిక శక్తిలో భారత్ను దెబ్బతీయాలని చెప్పాడు. అయితే కాశ్మీర్లోని మసీదులు, మార్కెట్లు, ముస్లింలు ఉండే ప్రాంతాలను మాత్రం టార్గెట్ చేసుకోవద్దని స్పష్టం చేశాడు.
ఉగ్రవాది జకీర్ మూసా గురించి జవహరి ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా వీడియో మధ్యలో అతని ఫోటో కనిపించింది. కాశ్మీర్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఆ ఫొటోను చూపించారు. అల్ ఖైదా ఇండియన్ సెల్ ఫౌండర్ అయిన జకీర్ మూసా ఉగ్రసంస్థను భారత్లో మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాశ్మీర్లో జరుగుతున్న పోరాటం వేర్పాటువాద సమస్య కాదని, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తులపై ముస్లింలు చేపడుతున్న జిహాదీ పోరుగా జవహరి అభివర్ణించాడు. ముస్లిం పెద్దలు ఈ తత్వాన్ని ప్రచారం చేయాలని పిలుపునిచ్చాడు.
పాకిస్థాన్ వ్యవహారశైలి పైనా జవహరి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ దేశం అమెరికా తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. ఉగ్రవాదులు పాక్ ఉచ్చులో పడకుండా ఉండాలని జాగ్రత్తలు చెప్పాడు. రాజకీయ లబ్ది కోసం ముజాహిద్దీన్ను పాకిస్థాన్ ఆర్మీ, ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని జవహరి ఆరోపించాడు.