భారత్లో ఆల్ఖైదా.. కేంద్ర హోంశాఖ హై అలర్ట్
న్యూఢిల్లీ: భారత్లో కూడా ఆల్ ఖైదా శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు ఆ సంస్ద అధినేత అల్ జవహరి ప్రకటించడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక్కసారిగా హై అలర్ట్ని ప్రకటించింది. అల్ జవహరి విడుదల చేసిన వీడియో విషయమై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిఘా ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్ ఖైదా విడుదల చేసిన ఈ వీడియో ఎంతవరకూ నిజమో కూడా చూడాలని హోం మంత్రిత్వశాఖ నిఘా ఏజెన్సీని కోరింది.
ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో దేశంలోని అన్ని పోలీసు స్టేషనను ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. "ఆల్ ఖైదా వీడియో నేపథ్యంలో మనమంతా మరింత అప్రమత్తం కావాలి. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలతో కలిసి పనిచేసి, రాష్ట్రానికి ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాలి" అని గుజరాత్ హోం శాఖలోని అత్యంత సీనియర్ అధికారి ఎస్కే నందా తెలిపారు.
భారత్లో కూడా ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేశామని, ఉపఖండంలో ఇస్లామిక్ పాలన నెలకొల్పి, జీహాద్ జెండా ఎగరేస్తామని అంటూ ఆల్ ఖైదా అగ్రనేత అల్ జవహరి ఓ వీడియోలో ప్రకటించారు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో నిడివి 55 నిమిషాలు. బర్మా, బంగ్లాదేశ్, అసోం, గుజరాత్, కాశ్మీర్ లాంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న ముస్లింలకు భారత ఉపఖండంలో ఆల్ ఖైదా రావడం శుభవార్త అవుతుందని ఆ వీడియోలో ఆల్ ఖైదా అగ్రనేత జవహరి అన్నారు.