ఆల్ ఖైదా: ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు
న్యూఢిల్లీ/లక్నో: ఢిల్లీ నగరంలో దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు రోజుకు ఒకరు అరెస్టు అవుతున్నారు. ఇటీవల అరెస్టు అయిన ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ నగరంతో పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్ లో ముగ్గురు అనుమానిత ఆల్ ఖైదా ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు.
గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని సాంబాల్ ప్రాంతంలో తలదాచుకున్న ఆల్ ఖైదా ఉగ్రవాది జాఫర్ మసూద్ అనే వ్యక్తిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు. ఇతనిని విచారించి మరింత సమాచారం సేకరించాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.
ఢిల్లీలో అరెస్టు అయిన మహమ్మద్ ఆసీఫ్ భారత్ లో ఆల్ ఖైదాకు ఏ క్యూ ఐఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా పని చేస్తున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు యువతను ఇతను ప్రేరేపిస్తున్నాడని అధికారులు చెప్పారు.
రిక్రూట్ మెంట్, శిక్షణ తదితర కార్యకలాపాలను ఈశాన్య ఢిల్లీలోని సీంపూర్ నుంచి మహమ్మద్ ఆసీఫ్ నిర్వహిస్తున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఆసీఫ్ కు సహరిస్తున్న మరో ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ ను ఒడిశాలోని కటక్ సమీపంలోని జగత్ పూర్ లో అరెస్టు చేశారు.
ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఢిల్లీలో దాడులు చెయ్యాలని ప్లాన్ చేశారని ఐబీ వర్గాలు ముందుగానే పసిగట్టాయి. ఐబీ వర్గాలు హెచ్చరించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కోక్కరిని అరెస్టు చేస్తున్నారు.