రెండేళ్ల తర్వాత కరుణని కలిసిన అళగిరి: ‘చర్చ లేదు’
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన డీఎంకే మాజీ నేత ఎంకే అళగిరి గురువారం తన తండ్రి కరుణానిధిని కలిశారు. దాదాపు రెండేళ్లుగా తండ్రికి దూరంగా ఉంటున్న ఆయన కరుణానిధిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే తమ తల్లిదండ్రులను కలిసేందుకే అళగిరి వచ్చారని ఆయన సోదరుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విషయాలు చర్చించలేదని చెప్పారు.
కాగా, స్టాలిన్తో ఆధిపత్య పోరు కారణంగా డీఎంకేకు అళగిరి దూరమైన విషయం తెలిసిందే. అన్నాడీఎంకేకు వత్తాసు పలికి సొంత పార్టీకి తలనొప్పిగా తయారైన ఆయన సస్పెండ్కు గురయ్యారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే పొత్తుపెట్టుకోవడంపై తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్, డీఎంకే రెండునూ ఒక రాజకీయ లక్ష్యం లేని పార్టీలని దుయ్యబట్టారు. ఎన్ని కూటమిలు ఏర్పడినా అన్నాడీఎంకేను ఏమీ చేయలేవని అళగిరి పేర్కొన్నారు. అయితే, ఈ నేపథ్యంలో కరుణానిధితో అళగిరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
తమిళనాడు మంత్రిపై డీఎంకే కార్యకర్త ఫిర్యాదు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని మార్చి 22న జరిగిన బహిరంగ సభలో డీఎంకె పార్టీ అధ్యక్షుడు ఎం.కరుణానిధి, ఎంకె.స్టాలిన్లపై తమిళనాడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బి.వలర్మాతి అమర్యాదకర వ్యాఖ్యలు చేశారంటూ డీఎంకె పార్టీ కార్యకర్త జిల్లా ఎన్నికల అధికారి, సాలెం జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశాడు.
సాలెం సెంట్రల్ జిల్లా డీఎంకె పార్టీ కార్యదర్శి రాజేంద్రన్ మంత్రికి వ్యతిరేకంగా బుధవారం ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన సీడీని, పూర్తి వివరాలను ఆధారాలతో ఎన్నికల అధికారికి అందజేశాడు. కాగా, మంత్రిపై వచ్చిన ఫిర్యాదుని ఎన్నికల అధికారి పరిశీలిస్తున్నారు. తమిళనాడులో మే 16 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.