ఇప్పుడే తిన్నా, ప్రశాంతంగా నిద్రపోతా: వేటుపై అళగిరి
పార్టీ జనరల్ సెక్రటరీ కె అంబాజ్గన్తో కలిసి తానీ నిర్ణయం తీసుకున్నానని కరుణానిధి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు(అళగిరి) పార్టీ తరపున కీలక బాధ్యతలు ఏమైనా నిర్వహిస్తారా? అనే సందేహాలు పార్టీ సభ్యుల్లో ఉన్నందున అళగిరిపై శాశ్వతంగా వేటు వేయడం జరిగిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో అళగిరి మీడియాతో మాట్లాడుతూ.. ‘డిఎంకె పార్టీ నుంచి నా తొలగింపుపై ఎలాంటి ప్రతిచర్య ఉండదు. నేను ఇప్పుడే భోజనం చేశాను. ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకుంటున్నాను. నాకేం నష్టం లేదు. వారే(డిఎంకె అధిష్టానం) నష్టపోతారు' అని అన్నారు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఏమైనా ఉన్నారా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
అళగిరితో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించకూడదని డిఎంకె అధిష్టానం తన పార్టీ శ్రేణులకు వారం క్రితమే ఆదేశాలు జారీ చేసింది. కాగా, జనవరి 24న డిఎంకె అధిష్టానం అళగిరి(63)ని సస్పెండ్ చేసింది. కరుణానిధి మరో కుమారుడైన ఎంకె స్టాలిన్(61) పార్టీ కీలక పదవిని చేపట్టేందుకు అళగిరి అడ్డుపడటంతో అతనిపై సస్పెండ్ వేటు పడింది.
కాగా, ఇటీవలే ప్రధాని మన్మోహన్ సింగ్ను, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కూడా అళగిరి కలిశారు. అయితే ఏదైనా పార్టీలో చేరాలా లేక కొత్త పార్టీ పెట్టాలా అనేదానిపై ఇంకా అళగిరి స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. తన మద్దతుదారులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని అళగిరి తెలిపారు.