ఇండియాలో మూడంటే మూడే 'క్లీన్ సిటీస్'..
న్యూఢిల్లీ : దేశంలో మూడంటే మూడు నగరాలే పరిశ్రుభతకు కేరాఫ్ గా ఉన్నాయని పేర్కొంది సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ (సీఎస్ఈ). సోమవారం నాడు సీఎస్ఈ విడుదల చేసిన తాజా నివేదిక, దేశంలో పరిశుభ్రతపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాతిపదికన సీఎస్ఈ నిర్వహించిన సర్వేలో కేరళలోని అలెప్పుజా, గోవా రాజధాని పనాజి, కర్ణాటకలోని మైసూరు మాత్రమే పరిశ్రుభమైన నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 'నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్' పేరుతో సీఎస్ఈ విడుదల చేసిన తాజా నివేదికలో.. ఘన వ్యర్థాల మేనేజ్ మెంట్ లో దేశ రాజధాని ఢిల్లీ అట్టడుగున ఉన్నట్టు వెల్లడయింది.
దేశం మొత్తం మీద ఒకరోజులో 80 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్టుగా చెప్పిన నివేదిక, 2047 నాటికి ఈ సంఖ్య 260 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేసింది. దీంతో భవిష్యత్తులో వేస్ట్ మేనెజ్ మెంట్ కు 1400 చదరపు కి.మీ స్థలం అవసరమవుతోందని, హైదరాబాద్, ముంబై, చెన్నై లాంటి మహానగరాలను కలిపితే ఏర్పడే ప్రాంతానికి ఇది సమానమని తెలిపింది.
దేశం మొత్తం మీద పరిశుభ్రమైన నగరాలు ఏవి అనే దిశగా తాము సర్వే నిర్వహించినట్టు చెప్పిన సీఎస్ఈ డైరెక్టర్ సునీత, పరిశుభ్రత విషయంలో కేరళ ప్రజలు అనుసరిస్తున్న విధానాలే అక్కడి నగరాల పరిశుభ్రతకు కారణమన్నారు.
వేస్ట్ మేనెజ్ మెంట్ నిర్వహణను అక్కడి ప్రజలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పి న ఆమె, అక్కడ ప్రజలే వ్యర్థాలను వేరు చేసి రీసైక్లింగ్ చేయడం, కంపోస్ట్ గా మార్చడం వంటివి చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో వ్యర్థాల నిర్వహణకు కేరళ ప్రజలు అనుసరిస్తున్న విధానమే అద్భుతమైన మోడల్ అన్నారు. కాగా, ఒకవేళ వేస్ట్ మేనెజ్ మెంట్ లో గనుక విఫలమైతే దేశంలోని నగరాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.