ఇంటెలిజెన్స్ అలర్ట్: పండగ సీజన్ సందర్భంగా భారత్లో ఆల్ఖైదా,ఐసిస్ దాడులు
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు జైషే మహ్మద్, లష్కరేతొయిబా లాంటి ఉగ్ర సంస్థలే భారత్ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తూ వచ్చాయి. తాజాగా ఆల్ఖైదా, ఐసిస్ ఉగ్రసంస్థల కన్ను కూడా భారత్పై పడిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ , అక్టోబర్ నెలల్లో పండగ సందర్భంలో భారత్లో ఉన్న యూదులు, ఇజ్రాయిల్ సమాజంలే లక్ష్యంగా దాడులు చేయాలని భావిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు కమ్యూనిటీలు ఎక్కువగా నివసిస్తున్న రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ చేశాయి ఇంటెలిజెన్స్ వర్గాలు.
సెప్టెంబర్ అక్టోబర్ నెలల మధ్య యూదులు చాలా పండుగలు జరుపుకుంటారు. రోష్ హషానా అంటే యూదులకు కొత్త సంవత్సరం అది సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1వ తేదీవరకు వేడుకలు జరుగుతాయి. ఆ తర్వాత యోమ్ కిప్పూర్ జుడాయిజంలో ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఇది అక్టోబర్ 8 మరియు అక్టోబర్ 9న జరుగుతుంది. అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 22 వరకు సుక్కోట్ అనే మరో ఫెస్టివల్ జరుగుతుంది. ఈ రోజుల్లోనే దాడులు చేసేందుకు ఆల్ఖైదా, ఐసిస్ కుట్ర చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు న్యూఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీపై కూడా దాడులకు తెగబడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు విదేశీ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇక టార్గెట్లో స్కూళ్లు, హోటళ్లు, ఇజ్రాయేలీయులు తరుచూ వెళ్లే ప్రదేశాలు ఉన్నాయి.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఇజ్రాయిల్ సమర్థించడంతో భారత్లో నివసించే ఇజ్రాయిల్ ప్రజలే లక్ష్యంగా దాడులు చేసేందుకు ఆల్ఖైదా, ఐసిస్ ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలల మధ్య చాలామంది ఇజ్రాయిల్ పర్యాటకులు భారత్కు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ఇజ్రాయిల్ ప్రజలే లక్ష్యంగా దాడులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి ఆల్ఖైదా మరియు ఐసిస్ ఉగ్రసంస్థలు. ఇందులో భాగంగానే భారత్పై కూడా గురిపెట్టినట్లు సమాచారం. న్యూఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ, జ్యూయిష్ స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇజ్రాయిల్ ప్రజలు తరచూ వచ్చే ప్రదేశాలే లక్ష్యంగా దాడులు చేసేందుకు పూనుకుంటున్నాయి ఉగ్రసంస్థలు.