భక్తులకు అలర్ట్... కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు మూసివేత..
భక్తులకు ముఖ్యగమనిక.. చార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను మూసివేయనున్నారు. చార్ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్ర ప్రతి సంవత్సరం వేసవికాలంలో మొదలయ్యి శీతాకాలంలో ముగుస్తోంది. ఏడాదిలో ఆరు మాసాల పాటు మాత్రమే ఈ యాత్రకు అనుమతి ఉంటుంది. ఈ ప్రదేశాలు హిమాలయాల్లో ఉండటం వల్ల శీతాకాలంలో మంచు తీవ్రత దృష్ట్యా ఈ యాత్రలను నిలిపివేస్తారు. తాజాగా ఆలయ కమిటీ ఈ సంవత్సరానికిగాను ఛార్ధామ్ యాత్ర ముగింపు తేదీలను ప్రకటించేసింది.
మొదట యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్, చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. యమునోత్రిలో మాత యమున పూజలందుకోగా, గంగోత్రిలో గంగామాత, కేదార్నాథ్లో పరమేశ్వరుడు, బద్రీనాథ్లో శ్రీమన్నారాయణుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక, ఈ సంవత్సరం ఇప్పటివరకూ ఛార్ ధామ్ యాత్రకు 38 లక్షల మంది భక్తులు వచ్చారని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ పేర్కొన్నారు. ఇందులో 11 లక్షల మందికి పైగా భక్తులు బద్రీనాథ్ దర్శించుకోగా, 13.5 లక్షల మంది భక్తులు కేదార్నాథ్ను సందర్శించారని అధికారులు వివరించారు.

ఏఏ తేదీల్లో...
రుద్రనాథ్ ప్రవేశ ద్వారాలు ఈ నెల (అక్టోబర్) 17వ తేదిన మూసుకోనున్నాయి. వీటితోపాటు గంగోత్రి ఆలయం వచ్చే నెల (నవంబర్) 2వ తేదిన మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేస్తారు. అలాగే, కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను నవంబర్ 3వ తేదిన మూసివేస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్ 4వ తేదిన తుంగనాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. వీటితోపాటు బద్రీనాథ్ ఆలయాన్ని నవంబరు 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నట్టు ఆలయ కమిటీ ఛైర్మన్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం చివరి పూజ నిర్వహించి, అఖండ జ్యోతిని వెలిగించి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. నవంబర్ 20వ తేదీన మధ్యమహేశ్వర్ ఆలయం మూతపడనుంది.












Click it and Unblock the Notifications