
సరిహద్దులో చైనా అస్థిరపరిచే కుట్రలు: భారత్ను అప్రమత్తం చేస్తూ యూఎస్ జనరల్
న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా తన కుట్రలు ఆపడం లేదు. లడఖ్ సమీపంలో చైనా కార్యకలాపాలు, సృష్టించబడుతున్న కొన్ని మౌలిక సదుపాయాలు ఆందోళనకరంగా ఉన్నాయని అమెరికాకు చెందని కీలక అధికారి ఒకరు చెప్పారు. హిమాలయ సరిహద్దులో చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాన్ని గురించి యూఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ జనరల్ చార్లెస్ ఎ ఫ్లిన్ మాట్లాడుతూ.. సరిహద్దులో పరిస్థితులను "అస్థిరపరిచే, విస్తరణ ప్రవర్తన'గా చైనా వ్యవహారం ఉందని తెలిపారు.
లడఖ్ సరిహద్దుల్లో చైనా మౌలిక వసతులు ఆందోళన కలిగించే అంశమని అమెరికా పసిఫిక్ కమాండ్కు చెందిన ఉన్నత సైన్యాధికారి జనరల్ చార్లెస్ ఫ్లిన్ అభిప్రాయపడ్డారు. చైనా పశ్చిమ థియోటర్ కమాండ్ హిమాలయ సరిహద్దుల్లో.. ఆందోళనర స్థాయిలో మౌలిక సౌర్యాలను అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. కొందరు ఎంపిక చేసిన పాత్రికేయులతో.. సంభాషణ సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. చైనా కపటవైఖరి, ఆక్రమణవాదం.. ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయలేదని ఫ్లిన్ వ్యాఖ్యానించారు. చైనా కుటిలనీతిని, నీతిబహ్యమైన చర్యలను అడ్డుకునేందుకు భారత్,అమెరికా కలిసి తీసుకుంటున్న చర్యలు ఉపకరిస్తాయని భావిస్తున్నట్లు జనరల్ ఫ్లిన్ చెప్పారు.

కాగా, భారత్, అమెరికా కలిసి హిమాలయ పర్వతాలపై.. 9 వేల నుంచి 10 వేల అడుగుల ఎత్తున అక్టోబరులో యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నాయి. అదే తరహాలో అమెరికాలోని అలస్కాలోని అత్యంత చల్లని వాతారణ పరిస్థితుల్లోనూ.. శిక్షణ నిర్వహించనున్నట్లు ఫ్లిన్ చెప్పారు. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఆయుధాలు ఉపయోగించే రీతులను సాధన చేయడమే ఈ సంయుక్త విన్యాసాల ఉద్దేశమని వివరించారు. ఈ విన్యాసాల్లో ఆధునిక సాంకేతికతలు, వైమానిక దళ వసతులు, వైమానిక దాడి వ్యవస్థలు, సౌకర్యాలు, రియల్ టైమ్లో సమచార మార్పిడి వంటి అంశాలు ఉంటాయని చెప్పారు. విలువకట్టలేని ఈ అవకాశాల ద్వారా భారత్, అమెరికా సైన్యాలు లబ్దిపొందాలని జనరల్ ఫ్లిన్ అభిప్రాయపడ్డారు.
కాగా, భారత్-చైనా మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసిన లడఖ్ సమీపంలో చైనా తన కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది. ఒకపక్క సైనిక స్థాయి చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు భారత్తో వాస్తవాధీనరేఖ వద్ద సైనిక మౌలిక వసతులను చైనా భారీస్థాయిలో పెంచేస్తోంది. సరిహద్దుల్లో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. ఆయుధాల మోహరింపులతో పాటు వైమానిక స్థావరాలు, రోడ్లను పెద్ద ఎత్తున ఆధునీకరిస్తోంది. చైనా ఇటీవల ప్యాంగాంగ్ సరస్సుపై.. బ్రిడ్జి నిర్మించినట్లు జనవరిలో వెలువడిన శాటిలైట్ చిత్రాల్లో వెలుగు చూసింది. చైనా తన బలగాలను మోహరిస్తుండటంతో.. భారత్ సైతం ధీటుగా పలు ప్రాంతాల్లో మోహరించడంతో చైనాకు మింగుడు పడడంలేదు.