వాజ్పేయీ ఇకలేరంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మేయర్..
మాజీ ప్రధాని వాజ్ పేయి మనమధ్య లేకపోయినా ఆయన తీపి గుర్తులు మనతో ఉన్నాయంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అలీఘడ్ మేయర్ శకుంతల.
అలీఘడ్: ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా!.. అయోమయపు మాటల్తో గందరగోళ పరిచినప్పుడు పక్కనున్న మిత్రులు సదరు వ్యక్తులను హెచ్చరించే తీరిది. మరి అదే రాజకీయ నాయకులైతే?.. ఓవైపు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటూనే.. మరోవైపు ఆయన మన మధ్య లేకపోవడం లాంటి వ్యాఖ్యలు చేయడం!.. చూసేవాళ్లను నోరెళ్లబెట్టేలా చేయవూ..
అలీఘడ్ మేయర్ శకుంతల తాజాగా ఇదే తరహా వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'వాజ్ పేయీ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన తీపి గుర్తులు మన మధ్య సజీవంగా ఉన్నాయి' అంటూ వ్యాఖ్యానించారు.
దీంతో జన్మదిన వేడుకులకు హాజరైనవారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అయితే ఆ వెంటనే తేరుకున్న శకుంతల తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశారు.వాజ్ పేయీ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టుగా తెలిపారు. జరిగిన తప్పిదానికి సభికులకు క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది.