కరోనాను జయించిన కేరళ.. అందరినీ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు..
ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19(కరోనా వైరస్)పై కేరళ వైద్యులు విజయం సాధించారు. చైనాలో వైరస్ బారినపడి.. ఇక్కడికి తిరిగొచ్చిన ముగ్గురు విద్యార్థులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఇక ప్రమాదంలేదని నిర్ధారణ కావడంతో ఈ నెల 14న మొదటి వ్యక్తిని డిశ్చార్జి చేసిన డాక్టర్లు.. గురువారం చివరి ఇద్దరిని కూడా ఇళ్లకు పంపేశారు. ఈ మేరకు కేరళ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అసలేం జరిగిందంటే..
చైనాలోని వూహాన్లో వివిధ యూనివర్సిటీల్లో చదువుతోన్న భారత విద్యార్థుల్లో కొందరిని ప్రభుత్వమే తరలించగా, ఇంకొందరు తమంతట తామే తిరిగొచ్చేశారు. అలా వచ్చినవాళ్లలో కేరళకు చెందిన ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆ ముగ్గురూ త్రిసూర్, అలెప్పీ, కాసర్ గోడ్ కు చెందినవాళ్లు. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ముగ్గురికీ చికిత్స అందించింది. బాధితులు క్రమంగా కోలుకోవడం, వారిలో వైరస్ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయినట్టు డాక్టర్లు గుర్తించారు. దీంతో రెండు విడతల్లో అందరినీ డిశ్చార్జ్ చేశారు.
ఇంట్లో 14 రోజుల అబ్జర్వేషన్..
కరోనా వైరస్ బాధితులకు 14 రోజుల పాటు చికిత్స అందించామని, పూర్తిగా నయమైందని నిర్ధారించుకున్నాకే డిశ్చార్జి చేశామని, వాళ్ల వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేనప్పటికీ జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి దగ్గర కూడా మరో 14 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని డాక్టర్ అమర్ ఫెటైల్ తెలిపారు.
తగ్గిన మరణాల రేటు..
కోవిడ్-19(కరోనా వైరస్)కు ఇంకా మందు కనిపెట్టనప్పటికీ.. అందుబాటులో ఉన్న మందులతో రోగ లక్షణాలకు చికిత్స అందిస్తూ ప్రజల ప్రాణాలను నిలబెట్టడంలో డాక్టర్లు సక్సెస్ అయ్యారు. వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటికే 2000 మందికి చనిపోయారు. చైనా, భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడిన వాళ్ల సంఖ్య సుమారు లక్షకు పెరిగింది. అయితే వైరస్ విస్తరణతో పోల్చిచూస్తే.. మరణాల రేటు క్రమంగా తగ్గుతుండటం శుభపరిణామమని డాక్టర్లు చెబుతున్నారు.