ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా?: పరీక్ష రాసిన 8వేల మందిలో ఒక్కరూ పాస్ కాలేదు!
Recommended Video
పనాజీ: ఏదైనా పరీక్షలు రాస్తే అందరిలో కొందరైనా అర్హత సాధిస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన అందరికీ అందరూ చేతులెత్తేశారు. ఈ వింత ఘటన గోవాలో చోటు చేసుకుంది.
8వేల మందిలో..
గత సంవత్సరం అక్టోబర్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పరీక్షను ఈ సంవత్సరం జనవరి 7న నిర్వహించింది. 80పోస్టులకు గానూ 8వేల మంది దరఖాస్తు చేసి, పరీక్షలు రాశారు. అయితే, ఇందులో ఏ ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అర్హత సాధించకపోవడం గమనార్హం.
ఒక్కో పోస్టుకు వందమంది..
పరీక్షకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచుకున్న అభ్యర్థులకు గోవా ప్రభుత్వం డిగ్రీని అర్హతగా చేర్చింది. దీంతో ఒక్కో పోస్టుకు దాదాపు 100 మంది వరకు పోటీ పడ్డారు.
50శాతం మార్కులొస్తేనే అర్హత...
వంద మార్కులకు జరిగిన ఈ పరిక్షలో 50శాతం మార్కులు తెచ్చుకున్న వారిని ఇంటర్వ్యూ రౌండ్కు అర్హత సాధించేలా సంబంధిత అధికారులు నిబంధనల రూపకల్పన చేశారు. జనవరి 7న జరిగిన ఈ పరీక్షల తాలూకు ఫలితాలు ఇటీవలే విడుదల అయ్యాయి. 8వేల మంది రాసిన ఈ పరీక్షల్లో ఏ ఒక్కరూ కూడా అర్హత సాధించలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.
అకౌంట్స్లోనే వెనకబడ్డారు..
ఐదు గంటలపాటు జరిగిన ఈ పరీక్షలో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అకౌంట్స్కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇంగ్లీష్, జీకేలో కాస్త మెరుగైన మార్కులే తెచ్చుకున్నప్పటికీ.. అకౌంట్స్లో మాత్రం అభ్యర్థులు చాలా వెనకబడ్డారని తెలిపారు. కాగా, గోవా యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్లే పరీక్షలు ఆలస్యమయ్యాయని, అందుకే ఈ ఫలితాలని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా జనరల్ సెక్రటరీ ప్రదీప్ దుయ్యాబట్టారు.