గోమాంసం: అఖ్లాక్ హత్య కేసులో 10 మంది అరెస్టు
లక్నో: దాద్రీలో మహమ్మద్ అఖ్లాక్ హత్య కేసులో నిందితులు అందరిని అరెస్టు చేశామని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. గోమాంసం ఇంట్లో పెట్టుకున్నాడనే కారణంతో అతన్ని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.
సోమవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. వివేక్, శ్రీ ఓం, విశాల్, శివం, రూపేంద్ర, సందీప్, సౌరబ్, గౌరవ్, హరి ఓంతో సహ ఓ మైనర్ ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. హరి ఓం తప్పించుకుని బంధువుల ఇంటిలో తలదాచుకున్నాడు.
అతని ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరా తీసి బంధువుల ఇంటిలో తలదాచుకున్నాడని గుర్తించి అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే అందరిని అరెస్టు చేశామని విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు.
విశాల్ అనే వ్యక్తి స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడని పోలీసులు వివరించారు. ఇంటిలో గోమాంసం పెట్టుకున్నాడని ఆరోపిస్తు దాద్రిలోని బిసాహోదా గ్రామంలో మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మొదట ఆరోపణలు వచ్చాయి.
అహమ్మద్ అఖ్లాక్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ విషయంపై స్పందించారు. మొదట కేసు నత్తనడకన దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి ఈ కేసులో అందరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.