ఫలితాల తర్వాత పతనం ఖాయం..! పళని స్వామి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏఎంఎంకే..!!
చెన్నై/హైదరాబాద్ : ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే మద్దతుతో ముఖ్యమంత్రి ఎడప్పాడి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) అధికార ప్రతినిధి తంగతమిళ్సెల్వన్ సంచలన ప్రకటన చేశారు. 22 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఏఎంఎంకే ఘనవిజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
తమిళనాడులో ఆసక్తికర రాజకీయం..! ఉపపోరుతోనే ప్రభుత్వ పతనం అంటున్న ఏఎంఎంకే..!!
తేని జిల్లా కవిలక్కు ప్రాంతంలో మంగళవారం ఉదయం తంగతమిళ్సెల్వన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈనెల 23న లోక్సభ ఎన్నికలు, 22 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ పతనం తప్పదన్నారు. ఆండిపట్టి ఏఎంఎంకే కార్యాలయంలో 1.48 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు దాఖలైన కేసు అధికార పార్టీ కుట్రలో భాగమని ఆరోపించారు.
ఏఎంఎంకే ను దెబ్బ తీసేందుకు ఎన్నో కుట్రలు..! భయపడేది లేదన్న తంగతమిళ్ సెల్వన్..!!
ఆ సంఘటనకు సంబంధించి తమ పార్టీకి చెందిన న్యాయవాది సెల్వంను అరెస్టు చేశారని, త్వరలో బెయిలుపై ఆయనను విడుదల చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని తంగతమిళ్సెల్వన్ తెలిపారు. ఏఎంఎంకే.. డీఎంకే బీ-టీమ్గా పనిచేస్తోందంటూ మంత్రి డి.జయకుమార్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, తమ పార్టీ బీ-టీమ్గా ఉంటే ఉప ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా ఎందుకు పోటీ చేస్తామని ప్రశ్నించారు.
ఫలితాల తర్వాత మారనున్న సమీకరణాలు..! ఎడప్పాడి ప్రభుత్వానికి బంగపాలు తప్పదంటున్న సెల్వన్..!!
ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి 35 శాసనసభ్యుల సంతకాలు అవసరమని, ఉప ఎన్నికల్లో 22 శాసనసభ స్థానాలను గెలుచుకుంటే తమ పార్టీ సంఖ్య 23కు పెరుగుతుందని, తక్కిన 12 మంది శాసనసభ్యుల కోసం ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సాయం పొందుతామని తంగతమిళ్ సెల్వన్ వివరించారు.
డీఎంకేతో కలవం..! ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాత్రమే సహకరిస్తామన్న సెల్వన్..!!
తమ పార్టీకి చెందిన 18 మంది శాసనసభ్యులను అక్రమంగా అనర్హులుగా ప్రకటించిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగేలా చూస్తూ ఊరుకునేది లేదని, డీఎంకేతో చేతులు కలిపి ఎడప్పాడి సర్కారును కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. ఒక వేళ ఎన్నికల ఫలితాలు డీఎంకేకు సానుకూలంగా మారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం మద్దతునిచ్చే ప్రసక్తే లేదని తంగతమిళ్ సెల్వన్ స్పష్టం చేశారు.