తప్పుడు విధానాల వల్లే ఆర్థిక మందగమనం: మోడీ ప్రభుత్వాన్ని ఏకేసిన మన్మోహన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మరోసారి కేంద్రంపై ఆదివారం విమర్శల వర్షం కురిపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. స్థూల జాతీయోత్పత్తి 5శాతానికి పడిపోవడం చూస్తే మందగమన ప్రభావం తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
దారుణం: సమయానికి రాలేదని 73ఏళ్ల వైద్యుడిని కొట్టి చంపారు
ఉత్పాదక రంగం 0.6శాతానికి పడిపోవడంపై మన్మోహన్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో లోపాల కారణంగానే దేశం ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక, మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరుద్యోగం చాలా పెరిగిపోయిందని, వేలాది మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకుని రోడ్డున పడ్డారని మన్మోహన్ ఆరోపించారు.
దేశ వినిమయం తగ్గిందని, వినియోగ వృద్ధిరేటు 18నెలల కనిష్టానికి పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగం కుదేలవుతోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రం ఒడిదుడుకులకు లోనవుతోందని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
బడ్జెట్ ప్రణాళిక అమలులో లోపాలున్నాయని, విదేశీ మదుపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని అన్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతోందని మన్మోహన్ వ్యాఖ్యానించారు.
చట్టబద్ద సంస్థల్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే పనిలో ఉందని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. అంతేగాక, ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.1.76కోట్ల నిధుల్ని బదిలీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చే చర్యలు చేపట్టాలని మాజీ ప్రధాని సూచించారు.