బంగ్లాదేశీలు అందరూ భారతీయులే.. బెంగాల్ నుంచి ఎవరినీ వెనక్కి పంపబోమన్న మమత
''చాలా ఏళ్ల కిందటే బెంగాల్కు వలస వచ్చిన బంగ్లాదేశీలందరూ ఎప్పుడో భారతీయులైపోయారు. వాళ్లందరికీ ఓటు హక్కు ఉంది. ప్రధానుల్ని, ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటూనే ఉన్నారు. అల్రెడీ దేశ పౌరులైపోయినవాళ్లను మళ్లీ పౌరసత్వం నిరూపించుకోమని అడటం కరెక్ట్ కాదు. మీరు(బంగ్లాదేశీలు) ఎవరికీ రుజువులు చూపించాల్సిన పనిలేదు. పత్రాలు అడిగేవాళ్లను అసలు పట్టించుకోవద్దు.. ''అంటూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా మంగళవారం కాళీగంజ్ లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ సీఎం ఈ కామెంట్లు చేశారు. బెంగాల్ లో ఉంటోన్న బంగ్లాదేశీలందరూ భారతీయులేనన్న ఆమె.. అందులో ఏ ఒక్కరిని కూడా ఎన్ఆర్సీ జాబితాతో వెనక్కి పంపబోమని స్పష్టం చేశారు. పౌరసత్వం పేరుతో బీజేపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం బెంగాల్ లో సభ నిర్వహించిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. ''ఢిల్లీలో శాంతిభద్రతల్ని కాపాడటం చేతకాని కొందరు వ్యక్తులు బెంగాల్ కు వచ్చి బీరాలు పోతున్నారు. ఇక్కడికొచ్చి గప్పాలు కొట్టేబదులు.. ఢిల్లీలో కొంతైనా పనిచేసి ఉంటే అల్లర్లలో 47 మంది ప్రాణాలు పోయేవికాదు. దేశవ్యతిరేక శక్తులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బెంగాల్ ను ఢిల్లీగానో, ఉత్తరప్రదేశ్ గానో మారబోనివ్వను''అని దీదీ అన్నారు.
చాలా కాలం కిందటే వెస్ట్ బెంగాల్ పై ఫోకస్ పెంచిన బీజేపీ.. గతేడాది లోక్ సభ ఎన్నికల్లో 19 సీట్లు గెల్చుకుని దీదీకి షాకిచ్చింది. అదే ఊపుతో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఎంసీని మట్టికరిపించాలని భావిస్తోంది. ఈ క్రమంలో మోదీ, షా లాంటి బడా నేతలు తరచూ బెంగాల్ లో పర్యటిస్తూ, భారీ సభలు నిర్వహిస్తున్నారు. వాళ్లకు ధీటుగా మమత కూడా రెగ్యులర్ గా ప్రజల్లో తిరుగుతూ కేంద్రం విధానాలపై పోరాటం కొనసాగిస్తున్నారు.