మోడీ కేబినెట్ 2.0 : 60 మందికి అవకాశం? అమిత్ షా చేరికపై తొలగని సందిగ్దం..!
ఢిల్లీ : కేబినెట్ కూర్పుపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్షా వరుసగా రెండోరోజు సుదీర్ఘ మంతనాలు జరిపారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు చర్చోపచర్చల అనంతరం మంత్రుల పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్లో ఈసారి 50 నుంచి 60 మందికి అవకాశం దక్కనుందని సమాచారం. అయితే కీలక శాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈసారి మంత్రివర్గంలో సీనియర్లతో పాటు కొన్ని కొత్త ముఖాలు ఉంటాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మోడీ ప్రమాణ స్వీకారం: ముస్తాబైన రాష్ట్రపతి భవన్..అతిథులకు వడ్డిస్తున్న వంటకాలు ఇవే..!
కేబినెట్లో అమిత్ షా చేరికపై సస్పెన్స్
రాజకీయ వ్యూహాల్లో తలపండిన అమిత్ షా తొలిసారి కేంద్ర కేబినెట్లో చేరనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. వచ్చే ఏడాది పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షాను అప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ 1లో మంత్రులుగా పనిచేసిన రాజ్నాథ్, గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్లు మోడీ 2.0 కేబినెట్లోనూ కొనసాగే ఛాన్సుంది. అమేథీలో రాహుల్ను ఓడించిన స్మృతి ఇరానీకి కీలక శాఖ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల ఎంపీలకు కేబినెట్ సముచిత స్థానం దక్కే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ సుష్మా స్వరాజ్కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
మిత్రపక్షాలకు ప్రాధాన్యం
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవుల కేటాయింపులో ప్రాధాన్యం దక్కనుంది. శివసేన, జేడీయూలకు ఒక కేబినెట్, మరొక సహాయమంత్రి పదవులు దక్కే వీలుంది. అప్నాదళ్ నుంచి అనుప్రియ పటేల్, శిరోమణి అకాలీదళ్ నుంచి హర్సిమ్రత్ బాదల్, ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వార్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రామ్దాస్ అతావలేకు కేబినెట్లో చోటు కల్పిస్తారని సమాచారం. బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు ప్రభుత్వంలో భాగస్వాములు కానున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర ఎంపీలకు మంత్రి పదవులు
మహారాష్ట్ర, హర్యానాకు కేబినెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు మంత్రివర్గంలో భాగస్వామిని చేయనున్నట్లు సమాచారం. కర్నాటక నుంచి సదానందగౌడ, ప్రహ్లాద్ జోషి, మహారాష్ట్ర నుంచి గడ్కరీ, ప్రకాశ్ జవదేకర్, సురేష్ ప్రభుతో పాటు రావ్ సాహెబ్ దాన్వే పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. నరేంద్రమోడీ ప్రభుత్వంలో శివసేన నేత అరవింద్ సావంత్కు చోటు దక్కిందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రకటించారు.