ఇరోమ్ పదహారేళ్ల సుదీర్ఘ దీక్షకు రేపటితో ముగింపు
ఇంఫాల్ : పదహారేళ్ల సుదీర్ఘ దీక్షకు స్వస్తి పలుకుతూ మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ సంచలనం. మంగళవారం నాటితో ఇరోమ్ షర్మిల దీక్షకు తెరపడుతుండగా.. డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రాజకీయ పంథాను అనుసరిస్తానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే.
మంగళవారం నాడు ఇరోమ్ షర్మిల దీక్ష విరమణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కాగా, మణిపూర్ లో అమలు జరుగుతోన్న సాయుధ బలగాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో 2000 సంవత్సరం నుంచి దీక్ష చేస్తూ వస్తున్నారు ఇరోమ్ షర్మిల. దీక్ష ప్రారంభించిన నాటి నుంచి ఆసుపత్రి దిగ్బంధనంలోనే పోలీసుల పహారాలో ఆమె దీక్ష సాగుతూ వస్తోంది. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే నాజల్ ట్యూబ్ ద్వారా ఆమె ఆహారంగా తీసుకుంటూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దీక్ష విరమించే క్రమంలో మంగళవారం నాడు ఉదయం తొలుత ఆమె జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మెజిస్ట్రేట్ లో ఆమె దీక్ష విరమణ ప్రకటన చేయగానే జ్యుడీషియల్ కస్టడీ ముగిసినట్లుగా ప్రకటిస్తుంది కోర్టు. అటు తర్వాత తన మద్దతుదారులతో సమావేశం కానున్న ఇరోమ్ షర్మిల.. తన భవిష్యత్తు ప్రణాలిక గురించి చర్చించనున్నారు.