2022లోగా దేశంలోని ప్రతీ ఇంటికి విద్యుత్: పీయూష్ గోయల్
దేశంలోని అన్ని ఇళ్లకు ఆగస్టు 15, 2022 వరకు విద్యుత్ సౌకర్యం అందిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పస్టం చేశారు.
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఇళ్లకు ఆగస్టు 15, 2022 వరకు విద్యుత్ సౌకర్యం అందిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పస్టం చేశారు. అంతేగాక, వచ్చే మేలోగా దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ అందించడం జరుగుతుందని గురువారం ఆయన చెప్పారు. నిర్దేశించుకున్న కాలానికి ముందే ఈ లక్ష్యాలను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.
ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. 2012-13 మధ్యకాలంలో రూ. 2,53,700లుగా ఉన్న డిస్కంల నష్టం 2014-15కు రూ. 3,60,736కు చేరుకుందని తెలిపారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఎఫ్సీ) విడుదల చేసిన స్టేట్ పవర్ యూటిలిటీస్ రిపోర్టు ప్రకారం.. డిస్కమ్స్ నష్టాలు ఇలా ఉన్నాయి.. 2012-13 సంవత్సరానికి గాను రూ. 2,53,700 కోట్లు, రూ.3,04,228 కోట్లకు పెరిగాయి. 2014-15లో రూ. 3,60,736, 4,06,825కోట్లకు పెరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పరిస్థితిని అధిగమిస్తామని మంత్రి చెప్పారు. 2015లో ప్రారంభించిన ఉజ్వల్ డిస్కమ్ అస్సురెన్స్ యోజన(ఉదయ్) పథకంలో రాష్ట్రాలు పాల్గొనడం ద్వారా వార్షిక నష్టాలు 2015-16, 2016-17 మధ్య కాలంలో దాదాపు రూ.11,000కోట్లు తగ్గాయి.
2012-13 నుంచి 2016-17 మధ్య కాలంలో అన్ని వనరుల ద్వారా 99209.5మెగావాట్ల సామర్థ్యం పెరిగిందని చెప్పారు. డిస్కమ్ల సహకారం ద్వారా నష్టాలు తగ్గుతాయని చెప్పారు. పథకాల పరిమితులు, డిస్కంల పనితీరు నిర్వహణ లోపం వల్ల కొన్నిసార్లు నష్టాలు వస్తున్నాయని చెప్పారు.
గోయల్ ప్రొఫెసర్లా..
కాగా, విద్యుత్ రంగంపై ప్రసంగించిన పీయూష్ గోయల్ ఓ ప్రొఫెసర్లా వివరించారనిలోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. విద్యుత్ సౌకర్యాన్ని దేశ వ్యాప్తంగా ఏ విధంగా మెరుగు పరుస్తున్నామో గోయల్ సవివరంగా వివరించిన తర్వాత స్పీర్ ఈ మాట అన్నారు. 'పీయూష్ గోయల్ పేరు మార్చుకోవాల్సిందే.. ఇక ప్రొఫెసర్ పీయూష్ గోయల్ అని పిలవాలని స్పీకర్ అన్నారు. దీంతో సభ్యులంతా నవ్వులు చిందించారు.