ఇంటరాగేషన్ గదుల్లో సీసీటీవీలు... పోలీస్ స్టేషన్లు,దర్యాప్తు సంస్థలకు సుప్రీం సంచలన ఆదేశాలు...
దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు,సీబీఐ సహా అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లోని ఇంటరాగేషన్ గదుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. అత్యున్నత సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థలు,పోలీసులు నిందితులను విచారించే క్రమంలో.. రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 21 జీవించే హక్కుకు,వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారా అన్న అంశాన్ని పరిశీలించేందుకు వీలుగా న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఎస్ఐ,ఇన్స్పెక్టర్ గదుల్లోనూ...
'అన్ని రాష్ట్రాల పోలీస్ స్టేషన్లలో.. లాకప్స్లో, ఇంటరాగేషన్ గదుల్లో ఆడియో సౌకర్యంతో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అలాగే పోలీస్ స్టేషన్ ప్రవేశ ద్వారాల వద్ద,ఎగ్జిట్ వద్ద,లాబీల్లో,రిసెప్షన్ ఏరియాలో,సబ్ ఇన్స్పెక్టర్,ఇన్స్పెక్టర్ గదుల్లో,వాష్ రూమ్ బయట కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి. చాలావరకు దర్యాప్తు సంస్థలు తమ కార్యాలయాల్లోనే ఇంటరాగేషన్ చేపడుతుంటాయి. కాబట్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో,డైరెక్టోరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ తదితర దర్యాప్తు సంస్థల కార్యాలయాలన్నింటిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.' అని న్యాయస్థానం ఆదేశించింది.
రికార్డింగ్స్ను 18 నెలల పాటు భద్రపరచాలని...
కేసుల్లో సాక్ష్యాధారాల కోసం.. అవసరమైతే సీసీటీవీ వీడియో,ఆడియో రికార్డింగ్స్ను 18 నెలల పాటు భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సుప్రీం పేర్కొంది. దర్యాప్తు సంస్థలు నిందితులను విచారించే క్రమంలో మానవ హక్కుల ఉల్లంఘనలను తనిఖీ చేసేందుకు ఇండిపెండెంట్ ప్యానెల్ ఆ రికార్డింగులను అడిగే అవకాశం ఉంటుందని తెలిపింది. తాజా ఆదేశాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికతో ఆరు వారాల్లోపు రాష్ట్రాలు కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.
Recommended Video
మానవ హక్కుల ఉల్లంఘనను పరిశీలించేందుకే...
2018లో పంజాబ్లో వెలుగుచూసిన కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో భాగంగా సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది. ఈ కేసు వెలుగుచూసినప్పుడు దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినా... ఇప్పటికీ అది అమలుకాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను జనవరి 27కి వాయిదా వేసింది. నిందితుల విచారణలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అన్న అంశాన్ని పరిశీలించేందుకు సీసీటీవీ కెమెరాలు దోహదపడుతాయన్న ఉద్దేశంతో సుప్రీం తాజా ఆదేశాలు జారీ చేసింది.