nirbhaya case: మూసుకుపోయిన అన్ని దారులు: ఇక దోషులకు ఉరే! కోర్టుకు ఢిల్లీ సర్కారు
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఇక ఉరిశిక్ష తప్పదు. తాజాగా నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉంది.
Recommended Video
మూసుకుపోయిన అన్నిదారులు.. ఇక ఉరేయండి
నిర్భయ కేసులో ఉరిశిక్ష విధించబడిన నలుగురు దోషులు ముకేష్ కుమార్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31) ఇప్పటి వరకు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారని.. ఇక వారికి ఎలాంటి అవకాశాలు లేవని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు కొత్త తేదీని ప్రకటించేందుకు తాము కోర్టును కోరుతున్నామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని అవకాశాలు దోషులు వినియోగించుకున్నందున.. వారికి ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టును కోరింది ఢిల్లీ సర్కారు.
తాజాగా పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ తిరస్కరణ
మరణశిక్ష ఎదుర్కొంటున్న నలుగురు దోషులు కూడా తమకున్న న్యాయపరమైన అవకాశాలను ఇప్పటికే వినియోగించుకున్నారు. తాజాగా పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ను కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇతర దోషులు పెట్టుకున్న మెర్సీ పిటిషన్లను కూడా ఇప్పటికే రాష్ట్రపతి తిరస్కరించారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా నిర్భయ దోషులకు క్షమాభిక్షను వ్యతిరేకించాయి.
కొత్త తేదీని ప్రకటించనున్న కోర్టు..
మార్చి 3న నిర్భయ దోషులను ఉరితీయాలంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉండటంతో మార్చి 3న ఉరిశిక్ష అమలు కాలేదు. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఉరిశిక్ష అమలు చేయరాదంటూ ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జీ ధర్మేంద్ర రానా ఢిల్లీ ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కొత్త ఉరిశిక్ష అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
డిసెంబర్ 16, 2012లో అత్యంత అమానవీయ చర్య
2012, డిసెంబర్ 16న దక్షిణఢిల్లీలో 23ఏళ్ల మెడికల్ విద్యార్థి నిర్భయను ఆరుగురు నిందితులు బస్సులో సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఆ దుర్మార్గుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆరుగురు దోషుల్లో రామ్ సింగ్ అనే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడగా, మరో నిందితుడు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి జైలు నుంచి బయటికి వచ్చాడు. మిగిలిన నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ దోషులకు విధించాల్సిన ఉరిశిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడటం గమనార్హం.