మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో ఆ కష్టాలకు చెక్.. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వాలు..
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో విడత లాక్ డౌన్లో కేంద్రం అనేక సడలింపులనిచ్చింది. అందులో చాలా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం దుకాణాలకు కూడా అనుమతినిచ్చింది. దీంతో దాదాపు 45 రోజుల పాటు మూతపడ్డ మద్యం దుకాణాలు చాలా రాష్ట్రాల్లో తెరుచుకున్నాయి. అయితే మందుబాబుల భారీ క్యూ లైన్లతో ఫిజికల్ డిస్టెన్స్ కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వాలకు కూడా ఇదో తలనొప్పిలా మారింది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు మద్యం షాపులపై ఒత్తిడి తగ్గించడానికి హోమ్ డెలివరీ మార్గాలపై దృష్టి సారించాయి. ఒకవేళ లిక్కర్ హోమ్ డెలివరీకి ప్రభుత్వాలు ఓకె చెప్తే.. మందుబాబులకు గంటల పాటు క్యూ లైన్లో నిలుచునే కష్టాలు కూడా తప్పుతాయి.
మద్యం మత్తులో గొడవ, మూడో అంతస్తు నుంచి తోసిన ఇద్దరు, మేస్త్రీ మృతి
లిక్కర్ హోమ్ డెలివరీపై త్వరలోనే చాలా రాష్ట్రాల నిర్ణయం..
మద్యం హోమ్ డెలివరీకి పంజాబ్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికే అనుమతిచ్చాయి. దేశంలోని మరిన్ని ప్రధాన రాష్ట్రాలు కూడా లిక్కర్ హోమ్ డెలివరీపై సమాలోచనలు జరుపుతున్నాయని ఇంటర్నేషనల్ స్పిరిట్స్&వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ISWAI) ఛైర్మన్ అమృత్ కిరణ్ సింగ్ తెలిపారు. త్వరలోనే ఆ రాష్ట్రాలు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై చర్చించడానికి తమ సంస్థ తరుపున ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ప్రతినిధులను పంపించినట్టు చెప్పారు.
వైన్ షాపులపై ఒత్తిడి తగ్గించే మార్గం..
భారత్లో 80శాతం స్పిరిట్,వైన్ విక్రయాలు ISWAI సంస్థే జరుపుతున్నది. ఇందులో డియాజియో,బకార్డీ,పెర్నాడ్ రికర్డ్,ఎల్వీఎంహెచ్ కంపెనీలు కూడా ఉన్నాయి. 'రిటైల్ మార్కెట్లో ఆల్కాహాల్ విక్రయాలకు ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఇప్పుడు తప్పనిసరి. అదే సమయంలో రాష్ట్రాలకు లిక్కర్ ఆదాయం కూడా ముఖ్యమే. కాబట్టి మద్యం రిటైల్ షాపులపై ఒత్తిడి తగ్గించి హోమ్ డెలివరీ చేస్తే ఫిజికల్ డిస్టెన్స్ సమస్య ఉండదు. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలతోనూ చర్చిస్తున్నాం.' అని అమృత్ సింగ్ చెప్పారు.
జనాభా పరంగా పెద్దదే కానీ..
చాలావరకు రాష్ట్రాలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాయని.. అసోం మొదలు కేరళ వరకు ఇప్పటికే ఆ దిశగా కసరత్తులు మొదలుపెట్టాయని అమృత్ సింగ్ వెల్లడించారు. పంజాబ్,పశ్చిమ బెంగాల్ ఇప్పటికే లిక్కర్ హోమ్ డెలివరీ ప్రకటించాయని గుర్తుచేశారు. మరికొన్ని రాష్ట్రాలు పేపర్వర్క్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయని చెప్పారు. జనాభాపరంగా భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైనప్పటికీ.. లిక్కర్ రిటైల్ షాపుల పరంగా ఇస్లామేతర దేశాల్లో భారత్లోనే అతి తక్కువ మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. కాబట్టే ఈ వారం మద్యం దుకాణాలు రీఓపెన్ చేయగానే వాటిపై ఒత్తిడి పెరిగిందన్నారు.
లిక్కర్ రెవెన్యూ..
ఆల్కాహాల్ విక్రయాలపై అనేక విమర్శల నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు గత రెండు దశాబ్దాలుగా కొత్త లైసెన్సులు జారీ చేయలేదని.. దాంతో రిటైల్ షాపుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అమృత్ తెలిపారు. జీఎస్టీ,చమురు ఆదాయాలు తగ్గిపోవడంతో రాష్ట్రాలకు ఇప్పుడు మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ అన్నారు. సగటున దేశంలోని ప్రతీ రాష్ట్ర ఆదాయంలో 25శాతం లిక్కర్ రెవెన్యూ ఉంటుందన్నారు. కానీ ప్రస్తుతం జీఎస్టీ,చమురు రెవెన్యూ పడిపోయిన నేపథ్యంలో లిక్కర్ ఆదాయం 40శాతం వరకు ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలోని పేద వర్గాలను ఆదుకునేందుకు కావాల్సిన ఆదాయం లిక్కర్ నుంచే సమకూరుతోందన్నారు.
Recommended Video
నచ్చిన సంస్థతో టైఅప్ కావచ్చు..
లిక్కర్ హోమ్ డెలివరీపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు,రాష్ట్రాలకు వేర్వేరు రిప్రజేంటేషన్స్ ఇచ్చామని అమృత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన కంపెనీలతో టైఅప్ అయి లిక్కర్ హోమ్ డెలివరీ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. కేవలం జొమాటో మాత్రమే కాదు.. స్విగ్గీ,హిప్బార్ సహా తదితర సంస్థలు లిక్కర్ హోమ్ డెలివరీకి సిద్దంగా ఉన్నాయన్నారు. కాబట్టి వాళ్లలో ఎవరితో టైఅప్ అవాలనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకుంటాయన్నారు.