తాజ్మహల్ సహా చారిత్రక కట్టడాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్... సందర్శనకు కేంద్రం అనుమతి...
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 25 నుంచి చారిత్రక కట్టడాల సందర్శనను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో భాగంగా వీటికి సడలింపులనిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం(జూలై 6) నుంచి ఆగ్రాలోని తాజ్మహల్,ఢిల్లీలోని ఎర్రకోట సహా దేశంలోని పలు చారిత్రక కట్టడాలు తిరిగి సందర్శకులకు స్వాగతం పలకునున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మొదట లాక్ డౌన్ ప్రకటించడం కంటే ముందే దేశంలోని 3400 చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేస్తున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మార్చి 17న ప్రకటించింది. సుమారు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత వీటిల్లో ఆయా మతాలకు చెందిన 820 చారిత్రక కట్టడాలకు అన్లాక్ 1.0లో సడలింపులనిచ్చారు.
తాజాగా మిగతా చారిత్రక కట్టడాల సందర్శనకు కూడా కేంద్రం అనుమతించింది. అయితే ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులకు అనుగుణంగా అక్కడి ప్రభుత్వాలకే ఆ నిర్ణయం వదిలేసింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ దీనిపై ట్విట్టర్లో ఒక ప్రకటన చేశారు. జూలై 6వ తేదీ నుంచి అన్ని చారిత్రక కట్టడాల సందర్శనకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. అయితే తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
అన్లాక్ 2.0లో స్కూళ్లు,కాలేజీలు,మెట్రో రైళ్లు,సినిమా హాళ్లు,స్విమ్మింగ్ పూల్స్ను కేంద్రం అనుమతించని సంగతి తెలిసిందే. జూలై 31 వరకు వీటిపై నిషేధం కొనసాగనుంది.