దాడులను ఎదుర్కోవాలంటే తుపాకీ ఉండాల్సిందే: ముస్లింలు దళితులకు లాయర్ పిలుపు
దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర వెనకబడిన వర్గాల వారిపై సామూహిక దాడులు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఓ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన లాయర్ మొహ్మద్ పరాచా చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. దేశంలోని ముస్లింలు, దళితులు ఇతర వెనకబడిన సామాజిక వర్గాలకు చెందిన వారు తుపాకీ లైసెన్సు కోసం దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమపై దాడి జరుగుతుందనే అనుమానం వస్తే ఆత్మరక్షణ కోసం తమ దగ్గర ఉంచుకోవాలని అన్నారు. తుపాకీ కొనేందుకు అవసరమైతే ఆస్తులు కూడా అమ్ముకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
దేశంలో వెనకబడిన సామాజిక వర్గాల వారికి గన్ లైసెన్స్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియదన్న పరాచా... న్యాయపరమైన సలహాలు తాను ఇస్తానని చెప్పారు. దేశంలో ముస్లింలు, దళితులపై సామూహిక దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వీరంతా ఆత్మరక్షణ కోసం తుపాకీ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ న్యాయపరంగా గానీ చట్టపరంగా గానీ ఏదైనా ఇబ్బందులు వస్తే సహాయం చేసేందుకు తాను ఉన్నట్లు పరాచా చెప్పారు. ఆత్మ రక్షణ కోసం ప్రభుత్వమే మైనార్టీ వర్గాల వారికి తుపాకీలు ఇవ్వాలని అన్నారు. ఇక జూలై 26న తుపాకీ లైసెన్స్లు ఎలా పొందాలో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేదానిపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పరాచా చెప్పారు.
ఇదిలా ఉంటే ఆదివారం అవగాహన కార్యక్రమంను వాయిదా వేసుకోవాల్సిందిగా షియా మతపెద్దమౌలానా కల్బే జవాద్ లాయర్ పరాచాను కోరారు. అయితే లాయర్ పరాచా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. తన ఆయుధాలను ఎలా వినియోగించాలనేదానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని పరాచా చెప్పారని అయితే ఈ వ్యాఖ్యలను మీడియా మరోలా ప్రచారం చేసిందని మౌలానా చెప్పారు. ప్రభుత్వం ఈ మూకుమ్మడి దాడులపై ఏదైనా చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు షియా మతపెద్ద చెప్పారు. అంతేకాదు సామూహిక దాడులపై కఠిన చట్టాలు తీసుకొచ్చేలా నేతలపై ఒత్తిడి తీసుకొస్తామని ఇందులో భాగంగానే కొందరి నేతలను కలవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.