ముస్లింలు రాముని వారసులే ..రామమందిర నిర్మాణానికి సహకరించాలి: గిరిరాజ్ సింగ్
వివాదాలకు కేరాఫ్గా నిలిచే వ్యక్తి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. తాజాగా ఆయన మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంతా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సహకరించాలని వారంతా శ్రీరాముడి వారసులే అని అన్నారు. వారు మొఘల్ చక్రవర్తి బాబర్కు వారసులు కాదన్నారు. మథురాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులకు ఓర్పు సహనం నశిస్తే మథురా, అయోధ్య, కాశీలను లాగేసుకుంటారని ఆయన అన్నారు.
హిందువులకు సరాసరిగా చూస్తే ఇద్దరు పిల్లలు కూడా లేరని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ అంశానికి ఒప్పుకున్నారని అయితే మరో సామాజిక వర్గం ఉందని వారు మాత్రం ఇద్దరి పిల్లల కాన్సెప్ట్ను ఒప్పుకోవడం లేదని వారు ఒక పిల్లాడు చేతిలో ఉండగా మరో అబ్బాయి వీపు వెనక ఉండగా మరో బిడ్డ అప్పుడే కడుపులో పురుడు పోసుకుంటుందని చెబుతూ ముస్లింలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివభక్తుడిగా బిల్డప్ ఇస్తున్నారని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. కానీ శివుడిని పూజించే వారిని మాత్రం పక్కనబెడుతున్నారని చెప్పారు. మీరు నిజమైన హిందువులైతే గోమాంసం తినడం ఆపివేయాలని అన్నారు. అంతేకాదు కేవలం ఎన్నికల ముందు మీరు ఆలయాలను దర్శించడం మానుకోవాలన్నారు. భారతీయులంతా హిందువులు అని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన కొన్ని రోజులకే గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.