మహా కరోనా: ముంబై సహా ఈ నగరాలు 31 వరకు షట్డౌన్, పరీక్షలు రద్దు, ప్రమోటే.!
ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా పలు నగరాల్లో షాపులు, కార్యాలయాలు పూర్తిగా మూసివేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా 25 శాతం మంది ఉద్యోగులతో పనిచేయనున్నాయని తెలిపారు.
ముంబై, పుణె, నాగపూర్ షట్ డౌన్..
మహారాష్ట్రలోని ముంబై సహా పుణె, నాగపూర్ నగరాల్లో మార్చి 31 వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాల్ని పాటించాలని సీఎం ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. అయితే, నిత్యావసర కిరాణాలు, మందుల దుకాణాలకు, అత్యవసర సేవలకు మాత్రం దీని నుంచి మినహాయింపునిచ్చారు. అంతేగాక, అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు బయటకి రావొద్దని సూచించారు. కరోనాను చేయించాలంటూ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
పరీక్షలు రద్దు.. ప్రమోట్ చేస్తాం
ఇది ఇలావుంటే, ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ ప్రకటించారు. అందరినీ తర్వాతి తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇంటర్ విద్యార్థులకు రెండు పేపర్లు మాత్రమే మిగిలిపోయాయని, అవి యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. ఇక తొమ్మిది, పది తరగతుల వారికి ఏప్రిల్ 15 తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.
కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువ..
కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా సోకి మహారాష్ట్రలో ఒకరు మృతి చెందారు. కాగా, ఒక్క పుణె జిల్లాలోనే 21 మందికి వైరస్ సోకినట్లు ధృవీకరించారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐదు కరోనా మరణాలు సంభవించాయి. ఇందులో ఒక విదేశీయుడు ఉన్నాడు.