దుబాయ్కు ఎయిరిండియా విమానాలకు బ్రేక్: ఎప్పటివరకు? ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులకు బ్రేక్ పడింది. భారత్ నుంచి దుబాయ్ వెళ్లే అన్ని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది.. తాత్కాలికంగా. 15 రోజుల పాటు నిలిపివేసింది. ఈ మేరకు దుబాయ్ పౌర విమానయాన శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. కరోనా వైరస్. వైరస్ పాజిటివ్గా తేలిన ప్రయాణికుడొకరు దుబాయ్లో ల్యాండ్ అయ్యారు. దీనితో దుబాయ్ అధికారులు ఎయిరిండియా సర్వీసులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సీఆర్పీసీ 30: పోలీసుల గుప్పిట్లో కోనసీమ..ఉద్రిక్తత: అడుగడుగునా: పోలీసుల అదుపులో కమలనాథులు
రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి దుబాయ్కు బయలుదేరి వెళ్లిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తరువాత.. అక్కడి అధికారులు నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. మొదటిసారే దుబాయ్ ఎయిర్పోర్టులు, పౌర విమానయాన శాఖ అధికారులు ఎయిరిండియాకు కొన్ని సూచనలను జారీ చేశారు.
అయినప్పటికీ.. మరోసారి కరోనా పాజిటివ్ వ్యక్తి భారత్ నుంచి దుబాయ్కు వెళ్లారు. దీనితో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీసులను 15 రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు దుబాయ్ పౌర విమానయాన శాఖ అథారిటీ వాయు రవాణా, అంతర్జాతీయ వ్యవహారాల విభాగం సీనియర్ అధికారి ఎస్ ఏ కాంకఝర్ తెలిపారు. వచ్చేనెల 2వ తేదీ వరకు ఆయా సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
Recommended Video
ఒక్కరి వల్ల ఆ విమానంలోని మొత్తం ప్రయాణికులు, సిబ్బందికీ కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని అన్నారు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో ఎయిరిండియా తీసుకుంటోన్న చర్యలు సంతృప్తికరంగా ఉంటేనే వాటిని పునరుద్ధరిస్తామని చెప్పారు. తన సర్వీసులను పునఃప్రారంభించడానికి ముందు.. కరోనా వైరస్ సోకిన ప్రయాణికులను గుర్తించడానికి తీసుకున్న చర్యలపై తమ సమగ్ర నివేదికను ఎయిరిండియా అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఎయిరిండియా సానుకూల చర్యలను తీసుకుందని చెప్పారు.