ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం .. ముగిసిన అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని అఖిలపక్షం ఖండించింది. సరిహద్దులో ఉగ్రవాదుల దుశ్చర్యలను సహించబోమని తీర్మానం చేసింది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, టీఎంసీ సుదీప్ బంద్యోపాధ్యాయ్, డెరెక్ ఒబ్రెయిన్, శివసేన నుంచి సంజయ్ రౌత్, టీఆర్ఎస్ నుంచి జితేందర్రెడ్డి, సీపీఐ నుంచి డీ రాజా, అకాలీదల్ నుంచి నరేష్ గుజ్రాల్, ఆర్ఎస్ఎల్పీ నుంచి ఉపేంద్ర కుస్వాలా, జై ప్రకాశ్ నారాయణ యాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు. ఉగ్రదాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి.
ముగిసిన అఖిలపక్ష సమావేశం: ఉగ్ర దాడిని ఖండించిన అఖిలపక్షం
దాడిని ఖండిస్తూ తీర్మానం
ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ అఖిలపక్షం తీర్మానం చేసింది. ' ఈ నెల 14న అవంతిపొర వద్ద జరిగిన దాడి పిరికిపంద చర్య, ఈ ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం .. సరిహద్దుల్లో ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పేకలిస్తాం‘ అని చేసిన తీర్మానాన్ని మీడియాకు విడుదల చేసింది.
మీ వెన్నంటే .. ఉన్నాం ...
దాడికి ప్రతీగా ప్రభుత్వం చేపట్టి చర్యలకు సమర్థిస్తామని ప్రకటించాయి. దాడితో భారత జాతి ఆగ్రహంతో ఉన్నదని సమావేశం తర్వాత గులాంనబీ ఆజాద్ మీడియాతో చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన అతి పెద్ద దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ విపక్షంగా వివిధ రాజకీయ, విధానపరమైన అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వంపై విభేదిస్తుంది .. కానీ దేశరక్షణ కోసం పాటుపడే జవాన్లపై దాడిని ఖండిస్తామని చెప్పారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థిస్తామని పేర్కొన్నారు.
పార్టీ అధ్యక్షులతో భేటీ ఏర్పాటు చేయండి ..
అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీ అధ్యక్షులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించాలని సమావేశానికి అధ్యక్షతన వహించిన రాజ్ నాథ్ సింగ్ ను కోరారు కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్. ఆల్ పార్టీ మీటింగ్ తో పాటు .. పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు.
కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం
దాడిలో చనిపోయిన కుటుంబాలకు వివిధ రాష్ట్రాలు పరిహారం ప్రకటిస్తున్నాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి ఆ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. శనివారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ .. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన ఇద్దరూ తమిళనాడుకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు.