సైన్యానికి 'ఆల్ పార్టీ' మద్దతు: 'సైన్యం మెరుపుదాడితో తిప్పికొట్టింది'
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సరిహద్దుల్లో సర్జికల్ దాడికి అఖిల పక్షం మద్దతు లభించింది. ఎల్వోసీ దాడుల పైన అఖిల పక్షం నిర్వహించారు. ఈ భేటీలో మనోహర్ పారికర్, సీతారాం ఏచూరి, పాశ్వాన్, రాజ్ నాథ్ సింగ్, శరద్ యాదవ్, సీఎం రమేష్ అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.
సర్జికల్స్ దాడికి అఖిల పక్షం మద్దతు తెలిపింది. అలాగే ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టిన భారత సైన్యాన్ని అభినందించింది. అఖిల పక్ష భేటీ అనంతరం కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు.
ఆర్మీ మెరుపుదాడి చేసిందన్నారు. ఉగ్రవాదులు కుప్వారా నుంచి ఐదుచోట్ల చొరబాట్లకు ప్రయత్నాలు చేశారని చెప్పారు. పాకిస్తాన్ పన్ని కుట్రకు జవాబే ఈ సర్జికల్ దాడులు అన్నారు. భారత్ సైన్యానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. ఉగ్రవాద చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. కాగా నార్త్ బ్లాక్లో అఖిల పక్ష సమావేశం జరిగింది. అఖిల పక్ష నేతలకు జరిగిన పరిణామాలను, తాజా పరిస్థితులను వివరించారు.
సైన్యం జరిపిన దాడిపై, పాక్ చొరబాట్ల పైన డీజీఎంవో చీఫ్ రణబీర్ సింగ్ వివరించారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ చెప్పారు. ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేసిన సైనికులకు తాను మరోసారి సెల్యూట్ చేస్తున్నానని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ చూపిస్తామన్నారు.
అఖిల పక్ష భేటీలో అన్ని పార్టీలు సైన్యాన్ని అభినందించాయని టిడిపి ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. పాక్కు భారత ఆర్మీ తగిన బుద్ధి చెప్పిందన్నారు. నిఘా వర్గాల పూర్తి సమాచారంతో మన ఆర్మీ ఉగ్రవాదులపై దాడులు చేసిందన్నారు. పాక్కు తగిన బుద్ధి చెప్పారన్నారు. అవసరమైతే మరిన్ని దాడులు చేస్తామని రక్షణ శాఖ అధికారులు చెప్పారని తెలుస్తోంది.