మొహమాటం ఏమీ లేదు: అన్ని రంగాల్లోనూ ప్రైవేటుకు ద్వారాలు: పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పాలసీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించడానికి కేంద్రప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు రంగపైనా ఆధారపడినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బొగ్గు, బాక్సైటు, ఖనిజ వనరుల తవ్వకాలు, విమానాశ్రయాల వంటి రవాణా, మౌలిక రంగాల్లో ప్రైవేటు సంస్థలకు ద్వారాలను తెరిచేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇక తాాజాగా అన్ని రంగాల్లోనూ ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వబోతోంది. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి మొహమాటానికి గానీ.. బేషజాలకు గానీ పోనట్టే కనిపిస్తోంది.
అన్ని రంగాల్లోనూ ప్రైవేటు పార్టీలకు అవకాశం..
దేశంలోని అన్ని రంగాల్లో కూడా ప్రైవేటు ప్లేయర్లను అనుమతి ఇచ్చేలా విధానాలను పునఃసమీక్షించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికోసం సరి కొత్తగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విధానాల్లో మార్పులను తీసుకొని వస్తామని ఆమె తేటతెల్లం చేశారు. ఏఏ రంగాల్లో ప్రైవేటు పార్టీలకు అవకాశం కల్పించామనే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రైవేటు భాగస్వామ్యం కల్పించడం వల్ల ఆయా రంగాలు నిర్దేశిత గడువు కంటే ముందుగానే బలోపేతమౌతాయని చెప్పారు.
Recommended Video
నేరుగా ఫారిన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో
దేశీయ పబ్లిక్ కంపెనీలు విదేశాల్లోని స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ మార్కెట్లలో తమ సెక్యూరిటీస్లను నేరుగా లిస్టింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించినట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్. విదేశీ జ్యూరిస్డిక్షన్స్లల్లో తమ కంపెనీలను లిస్టింగ్ చేసుకోవడానికి దేశీయ సంస్థలు అనుమతులు తీసుకోనక్కర్లేదని ఆమె చెప్పకనే చెప్పినట్టయింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ లిస్టుల్లో ఉన్న దేశీయ కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ మార్కెట్లకు వెళ్లడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసమే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విధానాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు.
వ్యూహాత్మక రంగాల్లోనూ..
కొన్ని వ్యూహాత్మక ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ప్రైవేటు సంస్థలకు అవకాశాలను కల్పించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక్కో వ్యూహాత్మక రంగంలో కనీసం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను కొనసాగిస్తామని, అందులో కూడా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని కల్పిస్తామని అన్నారు. మిగిలిన ప్రభుత్వ రంగలను ప్రైవేటీకరించబోతున్నామని ఆమె స్పష్టం చేశారు. ఒక్కో రంగంలో ఒకటి నుంచి నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగుతున్నాయని చెప్పారు. వాటిని ప్రైవేటీకరిస్తామని అన్నారు.
సోషల్ ఇన్ఫ్రాలో
సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం ఇవ్వబోతున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్)ను భర్తీ చేసుకోవడానికి 8,100 కోట్ల రూపాయల నిధులతో ఓ పథకాన్ని రూపొందించామని అన్నారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకోవడం ఇందులో భాగమేనని చెప్పారు. దీనివల్ల ఆయా రంగాలో మరింత బలోపేతమౌతాయని, చివరికి ప్రజలకు మేలు చేస్తాయని అన్నారు.