సీఎం యడియూరప్ప మంత్రివర్గం ఏర్పాటుకు డేట్ ఫిక్స్, ఆ ఎమ్మెల్యేలకు నో చాన్స్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మొదటి విడతలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడానికి ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప డేట్ ఫిక్స్ చేశారు. ఆనర్హత ఎమ్మెల్యేలకు మొదటి విడతలో చాన్స్ లేదని తెలిసింది.
ఢిల్లీలో చర్చలు
జులై 26వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి ఢిల్లీ పెద్దల అనుమతి కోసం యడియూరప్ప వేచి చూస్తున్నారు. ఆగస్టు 16వ తేదీ ఢిల్లీ రావాలని బీజేపీ హైకమాండ్ నుంచి ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు పిలుపు వచ్చింది.
అమిత్ షా ఆదేశం
కర్ణాటకలో ముప్పుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి చక్కదిద్దిన తరువాత ఢిల్లీ రావాలని కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సూచించారు. అమిత్ షా ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కర్ణాటకలో వరద ముప్పుకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భాదితులకు వెంటనే సహాయం చెయ్యాలని సీఎం యడియూరప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆగస్టు 19 డేట్ ఫిక్స్ !
ఆగస్టు 19వ తేదీ బెంగళూరులోని రాజ్ భవన్ లో మంత్రి పదవులు చేపడుతున్న ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 16వ తేదీ శుక్రవారం అమిత్ షాతో సీఎం యడియూరప్ప భేటీ అవుతున్నారు. ఇప్పటికే సిద్దం చేసుకున్న జాబితాను అమిత్ షాకు ఇచ్చి మంత్రి వర్గం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని యడియూరప్ప నిర్ణయించారు.
అనర్హత ఎమ్మెల్యేలకు నో చాన్స్
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరుగుబాటు చేసి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణం అయిన తరువాత అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు ఇప్పట్లో మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదు. సుప్రీం కోర్టులో అనర్హత ఎమ్మెల్యేల అర్జీ ఇంకా విచారణకు రాలేదు. సుప్రీం కోర్టులో అనర్హత ఎమ్మెల్యేల విషయం ఏదో ఒకటి తేలిన తరువాత రెండవ విడతలో వారికి మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.
మంత్రి పదవులు !
యడియూరప్ప మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవాలని చాల మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఆశ పడుతున్నారు. మొదటి విడతలో జగదీష్ శెట్టర్, కేఎస్. ఈశ్వరప్ప, బళ్లారి శ్రీరాములు, ఆర్. అశోక్, గోవింద కారజోళ, డాక్టర్ అశ్వథ్ నారాయణ, జేసీ. మధుస్వామి, బాలచంద్ర జారకిహోళి, కోటా శ్రీనివాస పూజారి, వి. సోమన్న, కేజీ, బోపయ్యలకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని సమాచారం.