బెంగళూరు ఆసుపత్రుల్లో ఓపీడీ సేవలు బంద్: చికిత్సకు రావద్దు, 22 వేల మంది డాక్టర్ల సమ్మె !
కర్ణాటకలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల సమ్మెగురువారం ఉదయం నుంచి బెంగళూరులో ఓపీడీ సేవలు రద్దుచిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లా వాసులు చికిత్స కోసం రావద్దు
Recommended Video
బెంగళూరు: బెంగళూరులో గురువారం ఉదయం 8 గంటల నుంచి అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీడీ సేవలు నిలిపి వేయాలని 30కి పైగా వైద్య సంఘాలు (డాక్టర్లు) నిర్ణయించాయి. బెంగళూరు నగరంలోని దాదాపు 6, 000 ఆసుపత్రుల్లో గురువారం ఉదయం నుంచి ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి.
బెళగావిలో వైద్యులు చేస్తున్న సమ్మెకు బెంగళూరులో దాదాపు 22 వేల మంది ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు మద్దతు ఇస్తున్నారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన వైద్య సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త చట్టం వలన ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా తయారౌతుందని అన్నారు.
వెంటనే ప్రభుత్వం అమలు చేసిన చట్టాన్ని రద్దు చెయ్యాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజామాన్యాలు, ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లడం వీలుకాదని వైద్య సంఘాల ప్రతినిధులు తెలిపారు.
బెంగళూరు నగరంలో చికిత్స చేయించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి, తమిళనాడులోని క్రిష్ణగిరి, ధర్మపురి, సేలం తదితర జిల్లాల నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు. బెంగళూరులో చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల నియంత్రణ కోసం కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం వలన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన డబ్బు మాత్రమే రోగులు నుంచి వసూలు చెయ్యాలి. రోగులు చనిపోతే బిల్లు చెల్లించాలని డిమాండ్ చెయ్యకూడదని తదితర షరతులను ప్రభుత్వం విధించింది.
ప్రైవేటు వైద్యుల సమ్మె విరమించడానికి కర్ణాటక ప్రభుత్వం అనేక సార్లు చర్చలు జరిపినా అవి ఫలించలేదు. సెలవుల్లో వెళ్లిన ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది వెంటనే విధులకు హాజరుకావాని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఇప్పటి వరకూ కర్ణాటకలో దాదాపు 10 మంది రోగులు మరణించారు.