ప్రాణగండం: మోడీ హత్యకు కుట్ర జరుగుతోంది...జాగ్రత్త
ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాణగండం ఉందా...? ఉగ్రవాదులు ఆయన్ను లక్షంగా చేసుకున్నారా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానికి ప్రాణాపాయం ఉందని తమ వద్ద సమాచారం ఉన్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే కొన్ని నిబంధనలను కఠినతరం చేసింది. ప్రధాని ప్రత్యేక సిబ్బంది అనుమతిస్తేనే ఆయనతో మంత్రులుగానీ, అధికారులు గానీ కరచాలనం లేదా కలిసే అవకాశం ఉంటుందనే కొత్త నిబంధనను హోంశాఖ తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర పోలీస్ బాస్లకు లేఖ ద్వారా తెలియజేసింది.
2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని పాల్గొనే రోడ్ షోలే టార్గెట్గా కొన్ని ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. అయితే ప్రధాని మోడీకి ఇప్పుడు వచ్చిన ప్రాణాపాయ బెదిరింపులు కొత్త కాదని... అయితే ఈ సారి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అయితే ప్రతీసారి ప్రమాదం ఏదో ఒక రూపంలో పొంచిఉంటుందనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపినట్లు హోంశాఖ వెల్లడించింది. ఉగ్రవాదుల నుంచే కాదు... మావోల నుంచి కూడా మోడీకి ప్రమాదం ఉందని అందుకు నిదర్శనం.. మోడీని రాజీవ్ గాంధీ తరహాలో హత్య చేసేందుకు మావోలు కుట్ర పన్నారని వివరించింది. అయితే మావోల కుట్రను భగ్నం చేసినట్లు హోంశాఖ వెల్లడించింది.
ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని పలు రోడ్ షోలో పాల్గొంటారు. అయితే రోడ్ షోల సంఖ్య తగ్గించుకోవాల్సిందిగా హోంశాఖ ప్రధానికి సూచించింది. అంతేకాదు ముందుగా అనుకున్న రూట్లలో కాకుండా తాము సూచించే మార్గంలోనే వెళ్లాలని ప్రధానికి హోంశాఖ స్పష్టం చేసింది. ఛత్తీస్ఘఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా. బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పోలీసులు మరింత జాగ్రత్తతతో వ్యవహరించాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానికి తాము ఆదేశించలేమని అయితే ప్రజలతో మమేకం అవుతున్న సమయంలో కాస్త జాగ్రత్త వహించాలని మాత్రమే సూచించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.