ఉరి శిక్ష నుంచి జీవితఖైదుగా సీరియల్ కిల్లర్ కోలీకి శిక్ష తగ్గింపు
న్యూఢిల్లీ: నిఠారీ సీరియల్ కిల్లర్ సురీందర్ కోలీకి అలహాబాద్ హైకోర్టు శిక్షను కుదించింది. అతని మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పికె బాఘల్లతో కూడిన అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ మేరకు బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది.
నిఠారీ సీరియల్ కిల్లర్ సురీందర్ కోలీకి మరణశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ (పియుడిఆర్) ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని జారీ చేసింది. ఆ వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం తన తీర్పును వెలువరించింది.
పిల్కు అనుగుణంగానే సురీందర్ కోలీ కూడా తనకు విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. నిరుడు అక్టోబర్ 31వ తేదీన పిల్ దాఖలైంది. అంతకు మూడు రోజుల ముందు సుప్రీంకోర్టు కోలీ రీకాల్ దరఖాస్తును తిరస్కరించింది.
సెప్టెంబర్ 12వ తేదీన కోలీని ఉరి తీయడానికి ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, రీకాల్ పిటిషన్ పెండింగ్లో ఉండడంతో అది అమలు కాలేదు. అత్యంత దారుణమైన నిఠారీ వరుస హత్యల విషయం 2009 డిసెంబర్లో వెలుగులోకి వచ్చింది. నిఠారీ గ్రామంలో 19 మంది మహిళలు, పిల్లల శవాలు వెలుగు చూశాయి.