అంతిమ సంస్కారం ప్రాథమిక హక్కు... హత్రాస్ ఘటనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు... సుమోటో కేసు..
కనీసం కుటుంబ సభ్యులను కూడా అనుమతించకుండా రాత్రికి రాత్రే హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఈ సంఘటనను సుమోటో కేసుగా స్వీకరించింది. దీనిపై అక్టోబర్ 12 లోగా వివరణ ఇవ్వాలని హోంశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ,డీజీపీ,జిల్లా మెజిస్ట్రేట్కు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ రాయ్,జస్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
హత్రాస్ గ్యాంగ్ రేప్ : బాధితురాలి కుటుంబానికి రూ.25లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం...
హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలే...
'బాధితురాలి మరణం తర్వాత ఆమె అంత్యక్రియల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలు షాక్కి గురిచేశాయి. అందుకే ఈ కేసును కోర్టు సుమోటోగా స్వీకరిస్తోంది..' అని న్యాయమూర్తులు వెల్లడించారు. 'మరణించిన బాధితురాలి, బాధిత కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులను పోలీసులు,అధికారులు ఉల్లంఘించారా అన్న అంశాన్ని మేము పరిశీలించబోతున్నాం. ఒకవేళ అక్రమంగా,బలవంతంగా ప్రాథమిక హక్కులకు,మానవ హక్కులకు భంగం కలిగించే చర్యకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు...' అని స్పష్టం చేశారు.
ఆ కుటుంబ పరిస్థితులను అదనుగా తీసుకున్నారా...
రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21,ఆర్టికల్ 25లను ఉల్లంఘించే చర్యలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది. బాధిత కుటుంబం సామాజిక,ఆర్థిక పరిస్థితులను అదనుగా తీసుకుని అధికారులు వారి రాజ్యాంగ హక్కులను హరించారా అన్న కోణంలో విచారణ చేపడుతామని తెలిపింది. మృతులకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారం వారి హక్కు అని పేర్కొన్న న్యాయస్థానం... పర్మానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా,రాంజీ సింగ్ ముజీబ్ భాయి వర్సెస్ యూపీ ప్రభుత్వం,ప్రదీప్ గాంధీ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసులను ప్రస్తావించింది.
కేసును ప్రభావితం చేయకుండా...
ఈ కేసు విషయంలో బాధిత కుటుంబంపై ఎలాంటి ఒత్తిడి లేదా వారిని ప్రభావితం చేసే చర్యలు జరగకుండా చూసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 12న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలు ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(సెప్టెంబర్ 29) తెల్లవారుజామున చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులను ఇళ్లలో నిర్బంధించి పోలీసులే అర్ధరాత్రి 2.30గం. సమయంలో మృతదేహాన్ని ఖననం చేశారు.
Recommended Video
కుటుంబ సభ్యులను అనుమతించకుండా అంత్యక్రియలు...
మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. తమందరినీ ఇంట్లో పెట్టి.. తాళం వేసి మృతదేహాన్ని తరలించారని మృతురాలి సోదరుడు, సోదరి తెలిపారు. అప్పటికే గ్యాంగ్ రేప్ ఘటనపై బాధిత కుటుంబం ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. నిందితులు అగ్రవర్ణాలకు చెందినవారు కావడంతో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. బాధితురాలి మృతదేహాన్ని కూడా పోలీసులే ఖననం చేయడంతో... సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. యోగి సర్కార్కు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు నిరసనలు తెలియజేస్తున్నాయి.