ఉత్తరప్రదేశ్లో ఉగ్ర కలకలం: మధ్యప్రదేశ్ రైలు పేలుళ్లతో లింకులు!
అనుమానిత ఉగ్రవాది పక్క రాష్ట్రం వచ్చినట్లుగా సీనియర్ పోలీస్ ఆఫీసర్ దల్జీత్ చౌదరి చెప్పారు. కమెండోలు తొందరగానే అతన్ని పట్టుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
లక్నో: ఓవైపు యూపీ ఎన్నికలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంటే.. మరోవైపు ఆ రాష్ట్రంలో ఉగ్ర ఆనవాళ్లు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా లక్నో శివారులోని ఠాకూర్ గంజ్ ప్రాంతంలో ఉగ్రవాది తలదాచుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం అందిన తక్షణం అనుమానిత ఉగ్రవాది ఉన్న ఇంటిని ఏటీఎస్(యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్), పోలీసులు చుట్టుముట్టారు. ప్రస్తుతం ఉగ్రవాదికి పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీస్ చీఫ్ జావీద్ అహ్మద్ ధ్రువీకరించారు.
కాగా, నేటి ఉదయం మధ్యప్రదేశ్ లో జరిగిన రైలు పేలుళ్లతో సదరు ఉగ్రవాదికి లింకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 8మంది గాయపడినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, హోం మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మొత్తం వ్యవహారాన్ని ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉగ్రవాదిని పట్టుకోవడం కోసం జరుగుతున్న ఆపరేషన్ లో 20మంది కమెండోలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
అనుమానిత ఉగ్రవాది పక్క రాష్ట్రం వచ్చాడని, లొంగిపోవడానికి తిరస్కరించాడని సీనియర్ పోలీస్ ఆఫీసర్ దల్జీత్ చౌదరి చెప్పారు. కమెండోలు తొందరగానే అతన్ని పట్టుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాన్పూర్ లో మరో అనుమానితున్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
తొలుత కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు యూపీ ఇంటలిజెన్స్ అప్రమత్తమైంది. ఉగ్రవాది ఎక్కడ తలదాచుకున్నాడన్న దానిపై కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.