పొత్తు చిత్తవ్వడానికి క్రేజీ రీజన్ చెప్పిన రాహుల్..! అంతా కేజ్రీ నే చేసాడన్న కాంగ్రెస్ చీఫ్..!!
దిల్లీ/హైదరాబాద్ : ఎన్నికలు ఫలితాలు మరి రెండు వారాల్లో వెలువడుతున్న క్రమంలో ప్రాంతీయ పార్టీ నేతలతో పాటు జాతీయ పార్టీ నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఓ పక్క కాంగ్రెస్ బీజేపి పార్టీల పరస్పర ఆరోపణల పరంపర కొనసాగుతుండగా ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద కేజ్రీ వాల్ పై విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పొత్తు చిత్తవ్వడానికి కేజ్రీవాలే కారణమంటే సంచలన ఆరోపణలు చేసారు.
దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి..! ఢిల్లీ లో పెరిగిన ఆరోపణల వేడి..!!
ఐదో దశ పోలింగ్ ముగిసిన తరుణంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశ రాజధాని దిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు కుదరకపోవడానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాలే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో ఆయన బీజేపీకి గెలుపు అవకాశాలను దగ్గర చేశారని వ్యాఖ్యానించారు.
అంతా కేజ్రీవాలే చేసాడు..! ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్..!!
ఎన్నికల ప్రచారంలో భాగంగా దిల్లీలోని చాంద్నీచౌక్ నియోజకవర్గ పరిధిలో సోమవారం జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. కాంగ్రెస్పై అసత్య ప్రచారాలతో 2014లోనూ కేజ్రీవాల్ బీజేపీకి గెలుపు బాటలు పరిచారని ఆరోపించారు. దిల్లీలో బీజేపీని అడ్డుకోవాలంటే ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని కేజ్రీవాల్కు వివరించానని, అందులో భాగంగా కాంగ్రెస్ మూడు స్థానాల్లో, ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేయడానికి ప్రతిపాదించామని తెలిపారు.
బీజేపి ని తట్టుకునే పార్టీ కాంగ్రెస్సే..! కేజ్రీ అర్థం చేసుకోలేకపోయాడన్న రాహుల్ గాంధీ..!!
అందుకు తొలుత అంగీకరించినప్పటికీ అనంతరం హరియాణా, పంజాబ్లో పొత్తు అంశాన్ని తెర మీదకు తెచ్చారన్నారు. అది కుదరకపోవడంతో దిల్లీ విషయంలోనూ ఇచ్చిన మాట తప్పారన్నారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్ను అడ్డుకోగలదని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటకలో నిరూపించామన్నారు.
రాజీవ్ పై మోదీ విమర్శాలు..! హుందాగా స్పందించిన కాంగ్రెస్ చీఫ్..!!
అలాగే తన తండ్రి రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తన కుటుంబాన్ని ప్రధాని ఎంత అవమానించినా.. తనకు మాత్రం ఆయనపై ప్రేమ మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తు అంశంపై చర్చలు విఫలమైన నేపథ్యంలో కాంగ్రెస్, ఆప్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దిల్లీతో పాటు మరిన్ని రాష్ట్రాల్లోనూ పొత్తుకు ఆప్ పట్టుబట్టగా, కాంగ్రెస్ అందుకు నిరాకరించన విషయం తెలిసిందే..!