ఢిల్లీ లో ఆప్ కాంగ్రెస్ మద్య చిగురించిన పొత్తు..! మరి కొద్ది సేపట్లో అదికారిక ప్రకటన..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా సస్పెన్స్ త్రిల్లర్ సీరియల్ ను మరిపిస్తున్న ఢిల్లీ రాజకీయ పొత్తులు ఓ కొలిక్కి వచ్చాయి. ఆప్ నేతలతో కాంగ్రెస్ నాయకులు జరిపిన తుది సంప్రదింపులు ఫలించాయి. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షీలాదీక్షిత్, ఆప్ నేతల మధ్య జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా ముగిసాయని, ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడమే తరువాయని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ పొత్తు కేవలం ఢిల్లీ వరకే ఉంటుందని సమాచారం. మిగిలిన హర్యానా, పంజాబ్లో మాత్రం పొత్తుల్లేకుండానే వేర్వేరుగా ఇరు పార్టీలు పోటీకి వెళ్లాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్యజరుగుతున్న సుదీర్ఘ చర్చలకు తెరపడనుంది. ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ 5-2 సీట్లు పంచుకోవాలనేది ఒక ఫార్ములా కాగా, కాంగ్రెస్, ఆప్ 4-3 సీట్లు పంచుకోవాలనేది రెండో ఫార్ములా. కాగా ఈ పొత్తుకు సంబంధించి జరుపుతున్న కసరత్తు కొలిక్కి వచ్చిందని, మంగళవారం సాయంత్రం అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇరు పార్టీ శ్రేణుల్లో ప్రచారం సాగుతోంది. ఇరు పార్టీలకు మధ్య చర్చకు వచ్చిన రెండు ఫార్ములాల్లో ఏ ఫార్ములాతో పొత్తు ఖరారు అవుతుందనేది మరి కొద్ది గంటల్లో తేలనున్నాయి. పొత్తుల లెక్కలపై రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.