మహాకూటమికి భారీ షాక్: తేల్చేసిన మాయావతి, డిగ్గీ, కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు
లక్నో: కాంగ్రెస్ పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలో వివిధ పార్టీలతో కలిసి మహా కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ కూటమిలో కలిసే ప్రసక్తే లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చి చెప్పారు.
బీజేపీని ఓడించాలని ఉందా?
అసలు కాంగ్రెస్ పార్టీ.. బీజేపీని ఓడించాలనుకుంటుందా? అని ప్రశ్నించారు. తమ పార్టీతో పొత్తుకు కొందరు కాంగ్రెస్ నేతలు సుముఖంగా లేరని మాయావతి వ్యాఖ్యానించారు. లక్నోలో ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
డిగ్గీ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏజెంట్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ బీఎస్పీతో పొత్తుకు ప్రయత్నిస్తుంటే దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకిస్తున్నారని మాయావతి మండిపడ్డారు. దిగ్విజయ్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను ఒత్తిడిలో ఉన్నట్లు దిగ్విజయ్ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని అన్నారు.
బీఎస్పీని అంతం చేయాలని..
దిగ్విజయ్ సింగ్ సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలకు భయపడుతున్నారని మాయావవతి అన్నారు. బీఎస్పీని అంతం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కులతత్వం పెరిగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
ఆ మూడు రాష్ట్రాల్లోనూ ఒంటరిగానే.. కాంగ్రెస్కు బుద్ధి రాలేదు
బీజేపీ కాకుండా సంకీర్ణ పక్షాలపైనే కాంగ్రెస్ దాడి చేస్తోందని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదని అన్నారు. బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీపైనా ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారని చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఈ సందర్భంగా మాయావతి స్పష్టం చేశారు. ఇక ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో స్థానిక పార్టీలతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.