షాకింగ్: మమ్మల్నే గెలిపించండి... కాంగ్రెస్-జేడీఎస్ పొత్తుపై దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కాంగ్రెస్ - జేడీఎస్ అలయెన్స్పై జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పొత్తు కేవలం విధాన సౌధ వరకేనని, బయట కాదని కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పరిమితమైనదేనని వ్యాఖ్యానించారు. రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) స్థానానికి జరిగే ఎన్నికలో జేడీఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు.
సోమవారం ఈ స్థానానికి జరగనున్న ఎన్నిక కోసం దేవెగౌడ శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్తో పొత్తు విధాన సౌధ వరకే పరిమితమని, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ స్థానం నుంచి జేడీఎస్ తరపున రామచంద్రప్ప బరిలో ఉన్నారు.
పార్టీ కోసమే పని చేయండి
దేవెగౌడ తన రోడ్డు షోలో ముఖ్యమంత్రి కుమారస్వామి పేరు ప్రస్తావిస్తూ.. రామచంద్రప్పను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాము ఎవరి పట్ల అనుకూలంగా లేమని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం పని చేయాలన్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాకుండా జేడీఎస్ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు.
ఇదీ జేడీఎస్ చిత్తశుద్ధి
జేడీఎస్కు ఓటేస్తే బీజేపీకి వెళ్తుందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమపై ఆరోపణలు చేశారని దేవేగౌడ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇప్పుడు తాము వారితోనే పొత్తు పెట్టుకున్నామని అభిప్రాయపడ్డారు.. ఇప్పుడు వారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాబట్టి జేడీఎస్ చిత్తశుద్ధిని ప్రజలు గుర్తించాలన్నారు. బెంగళూరు మేయర్ పదవిని ముస్లీంలకు ఇచ్చిన పార్టీ తమదే అన్నారు.
అందుకోసం ఇక్కడకకు రాలేదు
కాంగ్రెస్ - జేడీఎస్ పొత్తుపై నీలిమేఘాలు కమ్ముకునేలా చేసేందుకు తాను ఇక్కడకు రాలేదని దేవేగౌడ అన్నారు. ఇవి ఎన్నికలు (ఉప ఎన్నికలు) అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం చేశారో అందరికీ తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కేసు ఈసీ ఎదుట పెండింగులో ఉందన్నారు. మా బీబీఎంపీ కార్పోరేటర్స్ కోరిక మేరకు తాము అభ్యర్థిని నిలబెట్టామని చెప్పారు. జేడీఎస్ను తండ్రి కొడుకుల పార్టీగా బీజేపీ చెబుతోందని, కానీ త్వరలో ఆ పార్టీ వైఖరి తేటతెల్లమవుతుందన్నారు.
ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటాపోటీ
అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన మునిరత్న కూడా కుమారస్వామి పేరు చెప్పి ఓట్లు అడగుతుండటం గమనార్హం. బీజేపీ తరపున పోటీలో ఉన్న మునిరాజు గౌడ కోసం మాజీ ముఖ్యమంత్రి యడ్యూర్ప ప్రచారం నిర్వహించారు.