Union Budget 2020: ఆ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ప్రత్యేక బడ్జెట్: వేల కోట్ల రూపాయల కేటాయింపు..
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, లడక్. ఈ రెండూ గత ఏడాదే కొత్తగా ఆవిర్భవించిన కేంద్ర పాలిత ప్రాంతాలు. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 375ను రద్దు చేసిన తరువాత.. ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది. జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ రెండింటినీ సమగ్రంగా అభివృద్ధి పథంలో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. ఈ సారి బడ్జెట్ కొత్తగా ఈ అంశాన్ని చేర్చింది కేంద్రం.
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి
ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి కోసం 36,715 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో 30, 757, లడక్ అభివృద్ధికి 5,958 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అంశాన్ని బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చినట్లు తెలిపారు. ప్రతి రూపాయి కూడా ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వినియోగిస్తామని అన్నారు.
లెవెల్ ప్లేయర్లుగా..
36,715 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల రూపురేఖలను సమూలంగా మార్చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మొత్తంతో ఈ రెండు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని అన్నారు. దశాబ్దాల కాలం పాటు జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లోనూ వెనుకంజలో ఉందని అన్నారు. వాటిని లెవెల్ ప్లేయర్లుగా తీసుకొస్తామని చెప్పారు. తోటి రాష్ట్రాలతో పోటీ పడేలా అభివృద్ధి పనులను ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపడతామని ఆమె తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పనకు..
కొత్తగా బడ్జెట్లో కేటాయాించిన నిధులతో జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని అన్నారు. రహదారులను మరమ్మతు చేయడంతో ఇప్పటిదాకా రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల్లో కొత్తవాటిని నిర్మిస్తామని అన్నారు. మంచినీటి సౌకర్యం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, నిరుపయోగంగా ఉన్న ప్రదేశాలను నివాస యోగ్యమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దటం వంటి కార్యక్రమాలను చేపడతామని నిర్మలా సీతారామన్ తెలిపారు.