పార్లమెంట్ భవనంలో కార్యాలయాల గదులను కోల్పోయిన తెలుగుదేశం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు పార్లమెంట్ భవన సముదాయంలో కార్యాలయ గదులను కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్ అదనపు డైరెక్టర్ సంజయ్ సేథీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలకు కార్యాలయాలు లభించాయి. తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశం దక్కలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు కార్యాలయాలను కేటాయించలేదు. దీనికి ప్రధాన కారణం.. నిబంధనలకు అనుగుణంగా ఎంపీల సంఖ్య లేకపోవడమేనని తెలుస్తోంది.
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పుల్ స్టాప్: రద్దు చేస్తూ ఉత్తర్వులు
ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా టీడీపీకి కేటాయించిన పార్లమెంట్ కార్యాలయ గదులను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. భారతీయ జనతాపార్టీ-2,3,4 గ్రౌండ్ ఫ్లోర్, అఖిల భారత కాంగ్రెస్-24,25 గ్రౌండ్ ఫ్లోర్, డీఎంకే-46 గ్రౌండ్ ఫ్లోర్, తృణమూల్ కాంగ్రెస్-20-బీ గ్రౌండ్ ఫ్లోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-5 గ్రౌండ్ ఫ్లోర్, శివసేన-128 థర్డ్ ఫ్లోర్, జనతాదళ్ (యునైటెడ్)-126 థర్డ్ ఫ్లోర్, బిజూ జనతాదళ్-45 గ్రౌండ్ ఫ్లోర్, బహుజన్ సమాజ్ పార్టీ-128-ఎ థర్డ్ ప్లోర్, తెలంగాణ రాష్ట్ర సమితి-125 థర్డ్ ఫ్లోర్, సమాజ్ వాది పార్టీ-130 థర్డ్ ఫ్లోర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-126-డీ థర్డ్ ఫ్లోర్, సీపీఎం-118-బీ థర్డ్ ప్లోర్, అన్నా డీఎంకే-45, గ్రౌండ్ ఫ్లోర్ లల్లో కార్యాలయ గదులను కేటాయించారు.
ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీకి చోటు దక్కలేదు. ఇదివరకు కేటాయించిన కార్యాలయాన్ని కూడా రద్దు చేశారు. దీనితో ఖాళీ చేయాల్సి వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు మాత్రమే లోక్ సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. కింజరాపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), కేశినేని నాని (విజయవాడ), గల్లా జయదేవ్ (గుంటూరు) ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యులుగా కొనసాగిన సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరడంతో ప్రాతినిథ్యాన్ని కోల్పోయింది టీడీపీ.