మాటలు కాదు: మోడీ, షాను ప్రశంసిస్తూనే.. పీవోకేపై సవాల్ విసిరిన శివసేన
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత శివసేన కేంద్రంపై విమర్శలను తీవ్రతరం చేసింది. ఇప్పటి వరకు కేంద్రం నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చిన శివసేన ఇప్పుడు.. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలో కలిసి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా మరోసారి కేంద్రానికి ఓ సవాల్ విసిరింది.
మాటలు చెబితే సరిపోదు..
పార్లమెంటు ఆదేశిస్తే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) స్వాధీనం చేసుకుంటామంటూ ఆర్మీ అధిపతి వనరణే చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. టుక్డే టుక్డే గ్యాంక్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కాదు.. భారత ఆర్మీకి పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు అనుమతివ్వాలని కేంద్రానికి సవాల్ విసిరింది. శివసేన మౌత్ పీస్ అయిన సామ్నాలో ఈ మేరకు కథనాన్ని వెలువరించింది.
సర్జికల్ స్ట్రైక్స్ చేసినా పాక్ తీరు మారలేదు..
ఆర్మీ అధిపతి చెప్పినదాంట్లో ఏం తప్పులేదని.. పీవోకేలోనే ఎక్కువ ఉగ్రవాద శిబిరాలున్నాయని, పాకిస్థానీ ఆర్మీ, ఐస్ఐ మద్దతుతోనే ఈ శిబిరాలు కొనసాగుతున్నాయని సామ్నా పేర్కొంది. పీవోకేలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పటికీ పాకిస్థాన్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదం మూలంగా వ్యాలీలో అనేక మంది సైనికులు మరణిస్తున్నారని.. కాశ్మీర్ కేవలం రాజకీయ, ఎన్నికల అంశంగా మారిపోయిందని పేర్కొంది. అందుకే తాము ఆర్మీ అధిపతి నరవణే చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఇస్తున్నామని చెప్పింది.
ఆర్మీకి అనుమతిస్తే దేశ ప్రజల కోరిక తీరుతుంది..
పీవోకేను కలపుకుని జమ్మూకాశ్మీర్ మొత్తం భారతదేశంలో అంతర్భాగమని 1994 ఫిబ్రవరిలోనే భారత పార్లమెంటు తీర్మానం చేసిందని నవరణే చేసిన వ్యాఖ్యలను శివసేన పత్రిక సామ్నా ప్రస్తావించింది. ఆర్మీ అధిపతి కోరినట్లుగా.. ప్రధాని నరేంద్ర మోడీ అనుమతిస్తే.. దేశ ప్రజలు కోరిక తీరుతుందని సామ్నా పేర్కొంది.
మోడీ, షాపై ప్రశంసలు..
అంతేగాక, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై సామ్నా ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే ఇప్పుడు పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం అనుమతిస్తే వీర్ సావర్కర్ కలలు కన్న అఖండ్ భారత్ ఆవిష్కృతమవుతుందని సామ్నా స్పష్టం చేసింది.