రేపట్నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: ఏకమైన విపక్షాలు, కీలక బిల్లులపై చర్చ
Recommended Video
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఉభయ సభలను కొనసాగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తప్పులను గట్టిగా ఎత్తి చూపించాలని పదమూడు ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, అయితే ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదనే భావన కలుగుతోందని రాజ్యసభ ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు. పార్లమెంటులోని ఆజాద్ కార్యాలయంలో విపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు సోమవారం సమావేశమై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు.
సమావేశానంతరం మీడియాతో ఆజాద్ మాట్లాడుతూ.. పార్లమెంటులో ఏ అంశాలను లేవనెత్తాలనేది నిర్ణయించామని, మంగళవారం ప్రభుత్వం ఏర్పాటుచేసే అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావిస్తామని చెప్పారు. ఉభయ సభలు సజావుగా కొనసాగాలంటూ పదమూడు ప్రతిపక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయని ఆజాద్ చెప్పారు. గత పార్లమెంటు సమావేశాలు కూడా సజావుగా కొనసాగాలని ప్రతిపక్షాలు కోరుకున్నాయి అయితే ప్రభుత్వం సభా కార్యక్రమాలకు అడ్డుపడి ప్రతిపక్షాలను అపఖ్యాతిపాలు చేశాయని ఆజాద్ ఆరోపించారు. అధికార పక్షానికి చెందిన కొన్ని పక్షాలు వ్యవహరించిన తీరు మూలంగానే గత పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగలేదని ఆయన చెప్పారు.
ఎన్డీఏ మిత్రపక్షాలు పార్లమెంటును అడ్డుకుంటే తమకు చెడ్డపేరు వచ్చిందని, అందుకే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తాము ఎలాంటి గొడవ చేయం.. చర్చల సందర్భంగా ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపిస్తామని ఆజాద్ ప్రకటించారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, బీసీలు, మైనారిటీల సమస్యలు ప్రస్తావిస్తాం, విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావిస్తామన్నారు. చర్చల సందర్భంగా గొడవ జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో గులాం నబీ ఆజాద్తోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహమద్ పటేల్, లోక్సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో పార్టీ పక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ, జ్యోతిరాధిత్య సింధియా, ఎన్సీపీ అధినాయకుడు శరద్ పవార్, టీఎంసీ నాయకుడు సుఖేందు శేఖర్ రాయ్, బీఎస్పీ సీనియర్ నాయకుడు సతీష్ చంద్ర, ఎస్పీ నాయకుడు రాంగోపాల్ యాదవ్, ఆర్జేడీ నాయకురాలు మీసా భారతి, డీఎంకే నాయకుడు ఎలంగోవన్, సీపీఎం సీనియర్ నాయకుడు మహమ్మద్ సలీం, సీపీఐ నాయకుడు డి.రాజా, జేడీ(యస్) నాయకుడు కుపేంద్ర రెడ్డి, ఆర్ఎస్పీ నాయకుడు ప్రేమచంద్రన్, ఏసీఎం నాయకుడు జోస్ కె మణి, యుఎంఎల్ నాయకుడు కునాలి కుట్టి తదితరులు పాల్గొన్నారు
కాగా, ప్రజల సమస్యలపై సభలో చర్చ జరపాలనుకుంటున్నాం.. ప్రభుత్వం చర్చలకు అనుమతి ఇస్తుందా లేదా అనేది వేచిచూడాలని ఆజాద్ చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభ, రాజ్యసభ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతున్నారు.
ఇది ఇలా ఉండగా, 123వ రాజ్యాంగ సవరణ బిల్లు, రాజ్యాంగం(షెడ్యూల్డ్ కులాలు, తెగలు) ఆర్డర్స్ సవరణ బిల్లు, 2016, సరోగసీ రెగ్యూలేషన్ బిల్లు, ముస్లిం మహిళల రక్షణ బిల్లు(వివాహ హక్కు) బిల్లు, నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు 2017లాంటి కీలక బిల్లులు ఈ సమావేశాల్లో చర్చకురానున్నాయి.